అక్క‌డి ప్రజలు ఇళ్ల‌లోంచి బయటకు రాకండి : సీఎం కేసీఆర్

CM KCR Alerts People On Rains. భారీ వర్షాల కారణంగా ఎస్సారెస్పీ ఎగువనుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్

By Medi Samrat  Published on  22 July 2021 7:44 AM GMT
అక్క‌డి ప్రజలు ఇళ్ల‌లోంచి బయటకు రాకండి : సీఎం కేసీఆర్

భారీ వర్షాల కారణంగా ఎస్సారెస్పీ ఎగువనుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉదృతి పెరుగుతున్నందున యుద్ద ప్రాతిపదికన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. బాల్కొండ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. తక్షణమే పర్యవేక్షించాలని ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఇప్పటికే నిర్మల్ పట్టణం నీటమునిగిందని అక్కడికి ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలను తక్షణమే పంపాలని.. సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని గోదావరి పరీవాహక ప్రాంత జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను, రెవిన్యూ అధికారులు, ఆర్ అండ్ బీ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలందరూ ఇళ్ల‌లోంచి బయటకు రావద్దని సీఎం కేసీఆర్‌ సూచించారు. వాగులు, వంకలన్నీ ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

గోదావరితో పాటు కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో.. మన రాష్ట్రంతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆయా రాష్ట్రాల వాళ్లు కూడా అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తుతున్నారని, ఈ నేపథ్యంలో తెలంగాణలోకి వరద ఉధృతి పెరగనున్నదని పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లోని తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ తమ జిల్లాల్లో, తమ తమ నియోజకవర్గాల్లో వుంటూ ఎప్పటికప్పుడు వరద పరిస్థిని సమీక్షిస్తూ వుండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ ప్రాంతాల అన్నిస్థాయిలలోని టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తెలంగాణ భవన్ కు అందుబాటులో ఉంటూ పరిస్థితులను సమీక్షిస్తుండాలన్నారు.

గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లోని అధికారులతో పాటు మొత్తం టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి మంత్రుల దాకా, పార్టీ కార్యకర్తలు నేతలంతా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలు కూడా బయటకు వెళ్ల‌కుండా ఇండ్లల్లో వుండడమే క్షేమమని సీఎం పునరుద్ఘాటించారు. రానున్న రెండు రోజులు అత్యంత భారీ స్థాయిలో వర్షాలు కురిసే పరిస్థితిల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా వుంటూ జాగ్ర‌త్త‌లు తీసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులందరూ అత్యంత అప్రమత్తంగా ఉంటూ తగు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.



Next Story