Telangana: సీఎం అల్పాహార పథకం.. టైమింగ్స్‌, మెనూ ఇక్కడ ఉంది

పాఠశాల విద్యార్థుల కోసం తెలంగాణలో శుక్రవారం `ముఖ్యమంత్రి అల్పాహార పథకం' ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 23 లక్షల మంది విద్యార్థులకు ఆహారం అందించనున్నారు.

By అంజి  Published on  6 Oct 2023 6:03 AM GMT
CM breakfast scheme, KTR, Telangana, Govt Schools

Telangana: సీఎం అల్పాహార పథకం.. టైమింగ్స్‌, మెనూ ఇక్కడ ఉంది

హైదరాబాద్: పాఠశాల విద్యార్థుల కోసం తెలంగాణలో శుక్రవారం `ముఖ్యమంత్రి అల్పాహార పథకం' ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దాదాపు 23 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆహారం అందించనున్నారు. సికింద్రాబాద్‌లోని వెస్ట్‌ మారేడ్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో కేటీఆర్‌ ఈ పథకాన్ని ప్రారంభించగా, ఇతర మంత్రులు వివిధ ప్రాంతాల్లో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ పథకం ప్రారంభించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 27,147 ప్రభుత్వ పాఠశాలల్లో 23 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకాన్ని అమలు చేయనున్నామని, అల్పాహారం చాలా పౌష్టికాహారంగా ఉంటుందని, తాను కూడా ఆహారాన్ని రుచి చూశానని చెప్పారు. ఆహారంలో నాణ్యత ఉండేలా చూడాలని, ర్యాండమ్‌ శాంపిళ్లను సేకరించి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించాలని ఆయన అధికారులను కోరారు.

తమిళనాడులో 1 నుంచి 5వ తరగతి చదువుతున్న పిల్లలకు కూడా ఇదే తరహా పథకాన్ని అమలు చేస్తున్నారని, అయితే 10వ తరగతి విద్యార్థులకు కూడా అమలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న పాఠశాల విద్యార్థుల కోసం అక్టోబర్ 24న విజయదశమి రోజున ఈ పథకాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుగా భావించింది. ఏదేమైనా ఈ పథకాన్ని ప్రభుత్వం ముందుగానే ప్రారంభించింది.

మెను నుండి ఎంచుకోవడానికి విద్యార్థులకు రెండు ఆప్షన్స్‌ ఇవ్వబడతాయి.

మెనూలో ఏముంది?

- సోమవారం- ఇడ్లీ, సాంబార్ లేదా గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ

- మంగళవారం- పూరి, ఆలూ కుర్మా లేదా రవ్వతో చేసిన టమాటా బాత్, చట్నీ

- బుధవారం- ఉప్మా, సాంబార్ లేదా కిచిడీ, చట్నీ

- గురువారం- తృణధాన్యాలతో చేసిన ఇడ్లీలు, సాంబార్ లేదా పొంగల్, సాంబార్

- శుక్రవారం- ఉగ్గాని/పోహా, తృణధాన్యాలతో చేసిన ఇడ్లీలు, చట్నీ లేదా గోధుమ రవ్వ కిచిడీ, చట్నీ

- శనివారం- పొంగల్, సాంబార్ లేదా వెజ్ పులావ్, రైతా/ఆలూ కుర్మా

ఈ పథకంతో తెలంగాణలోని 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరనుంది. పాఠశాల ప్రారంభం కావడానికి 45 నిమిషాల ముందు ఈ అల్పాహారం అందించనున్నారు.

ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పథకం అన్ని పని దినాలలో వర్తిస్తుందని ప్రభుత్వ ఉత్తర్వు గతంలోనే పేర్కొంది. పాఠశాలకు వెళ్లే పిల్లల పోషకాహార స్థితిని పరిష్కరించడానికి, పని చేసే తల్లుల భారాన్ని తగ్గించే ప్రయత్నంలో ఈ పథకం ప్రారంభించబడుతుంది. విద్యార్థుల ఆకలిని ఎదుర్కోవడం , పాఠశాలకు సాధారణ హాజరును ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం. ఇది మొబైల్ యాప్ ద్వారా నిశితంగా పరిశీలించబడుతుంది.

Next Story