ఎమ్మెల్యే రాజాసింగ్‌ను సమాజం నుండి బహిష్కరించాలి

CLP Leader Bhatti Vikramarka Fire On Rajasingh. స‌హృద్భావ వాత‌వ‌ర‌ణంలో ప్రపంచ దేశాలతో పోటీ ప‌డి తెలంగాణ రాష్ట్రం అభివృద్

By Medi Samrat  Published on  24 Aug 2022 12:21 PM GMT
ఎమ్మెల్యే రాజాసింగ్‌ను సమాజం నుండి బహిష్కరించాలి

స‌హృద్భావ వాత‌వ‌ర‌ణంలో ప్రపంచ దేశాలతో పోటీ ప‌డి తెలంగాణ రాష్ట్రం అభివృద్ది సాధించాలని యూపిఏ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ ప్ర‌త్యేక రాష్ట్రం ఇచ్చారని సీఎల్పీ నేత భ‌ట్టివిక్ర‌మార్క అన్నారు. శాంతియుత‌, ప్ర‌శాంత వాతావ‌ర‌ణం ఉన్న తెలంగాణ‌లో మ‌త ఆలజ‌డులు సృష్టించేందుకు బీజేపీ నాయకత్వం తెలంగాణపై మిడతల దండు దాడి చేసినట్టు చేస్తుందని విమ‌ర్శించారు. బీజేపీ నాయ‌కుల తీరు దేశ స‌మైఖ్య‌త‌, స‌మ‌గ్ర‌త‌ లౌకిక వాదానికి పెను ప్రమాదంగా మారిందని అన్నారు.

బీజేపీ అనుస‌రిస్తున్న మ‌త విభ‌జ‌న‌ రాజకీయాలతో దేశం కల్లోలం అవుతుందని కాంగ్రెస్ నేతలు ఎప్పటి నుంచో చెప్తున్నారని.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడిన మాటలు సభ్య సమాజం తల దించుకునే విధంగా, తెలంగాణ ప్ర‌శాంత వాతావ‌ర‌ణాన్ని క‌ల్లోలం చేసే విధంగా ఉన్నాయని అన్నారు. రాజాసింగ్ వ్యాఖ్య‌లు శాసన సభ్యులు మాట్లాడాల్సిన మాటల్లాగా లేవు. జుగుప్స‌క‌రంగా స‌మాజంలో మ‌త క‌ల్లోలాలు రెచ్చ‌గొట్టే విధంగా అల్ల‌ర్ల‌కు దారి తీసే విధంగా ఉన్నాయి. సమాజ హితం దృష్ట్యా రాజాసింగ్‌ను ప్ర‌భుత్వం కట్టడి చేయాలని కోరారు.

ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ.. ఇతరుల మతాన్ని గౌరవించాలి. కానీ ఇందుకు భిన్నంగా రాజాసింగ్ వ్యాక్యాలు ఉన్నందున భారత రాజ్యాంగం, చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. స‌మాజ హితానికి న‌ష్టం వాటిల్లే విధంగా మ‌త క‌ల్లోలాలకు దారి తీసేవిధంగా రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తున్న‌ ఎమ్మెల్యే రాజాసింగ్ ను స‌మాజం నుంచి బ‌హిష్క‌రించాల్సిన అవ‌స‌రం ఉందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే.. జరిగే నష్టానికి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. గతంలో దళితుల అల‌వాట్లు, వారు తినే ఆహార ప‌దార్థాల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసి వారి మనోభావాలు కూడా దెబ్బతినడానికి కారణం అయ్యాడు. భార‌త రాజ్యాంగం పైన ప్ర‌మాణం చేసి ప‌రిపాల‌న చేస్తున్న బీజేపీ పాల‌కులు.. రాజ్యాంగ విలువ‌ల‌ను కాపాడే విధంగా చిత్త‌శుద్దితో రాజాసింగ్‌పై చ‌ర్య‌లు తీసుకోవాలని అన్నారు. ఈ విష‌యంలో నాట‌క‌మాడిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తే ప్ర‌జ‌లు బీజేపీని క్ష‌మించ‌రని అన్నారు.

స‌మాజానికి మార్గదర్శిగా ఉండే వ్యక్తులను మాత్ర‌మే ప్ర‌జ‌లు నాయకులుగా ఎంచుకోవాలి. ప్ర‌జ‌ల జీవితాల‌తో చెల‌గాటామాడే వారిని దూరం పెట్టి వారి ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలని సూచించారు. రాజాసింగ్ కాదు.. ఎవరు మాట్లాడినా సభ్య సమాజం కట్టడి చేసే విధంగా ప్ర‌భుత్వం చ‌ర్య‌లుండాలని పేర్కొన్నారు.

రాజ‌కీయ ల‌బ్ధి కోసం కొంత మంది త‌మ ప‌రిధిని దాటి రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు మార్గ‌ద‌ర్శకులుగా, దిక్సూచిగా ఉండాల్సిన నాయ‌కులు మాట్లాడే బాషా ఆదర్శంగా ఉండాలి. కానీ కొంత మంది దీనికి భిన్నంగా బాషాను వాడుతున్నారని.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు భ‌ట్టివిక్ర‌మార్క.


Next Story