తెలంగాణ హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. దేశంలోని పలు హైకోర్టులకు చెందిన 19 మంది న్యాయమూర్తులు, అదనపు న్యాయమూర్తుల నియమకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. తెలంగాణ హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులుగా గౌస్ మీరా మొహియుద్దీన్, చలపతిరావు సుద్దాల, వాకిటి రామకృష్ణారెడ్డి, గడి ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు. వీరితో పాటు మధ్యప్రదేశ్ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తులు, నలుగురు అదనపు న్యాయమూర్తులు, గౌహతి హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం పలువురు న్యాయవాదులు, జ్యుడీషియల్ ఆఫీసర్లను న్యాయమూర్తులుగా, అదనపు న్యాయమూర్తులుగా నియమించాలని సిఫార్సు చేసింది. అందుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.