ఈ నెల 6న తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ ధర్నాలు: కేటీఆర్

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on  4 March 2024 8:45 AM GMT
brs,  ktr,  lrs, telangana govt,

 ఈ నెల 6న తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ ధర్నాలు: కేటీఆర్

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్‌ పార్టీ అమలుకు వీలుకాని హామీలు ఇచ్చిందని అన్నారు. రాష్ట్ర ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం మోపేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని మండిపడ్డారు. ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా చేస్తామని కాంగ్రెస్‌ ఎన్నికలకు ముందు చెప్పిందని గుర్తు చేశారు. అయితే.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ హామీని మర్చిపోయిందని అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు.

ఎల్‌ఆర్‌ఎస్‌కు ఫీజులు వసూలు చేయడానికి నిరసనగా ఈ నెల 6వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే 7న కలెక్టర్లు, ఆర్డీవోలకు విజ్ఞప్తి పత్రాలు ఇస్తామని ఆయన వెల్లడించారు.

గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఖజానా నింపడానికే ఎల్‌ఆర్‌ఎస్‌ అని కాంగ్రెస్‌ నేతలు అన్నారని గుర్తు చేశారు. కానీ.. ఇప్పుడు అదే కాంగ్రెస్‌ ప్రభుత్వం మార్చి 31 కల్లా కట్టి తీరాలని ప్రజలమీద కత్తి పెట్టారని అన్నారు కేటీఆర్. ప్రజల నుంచి రూ.20వేల కోట్లు వసూలు చేయడానికి సిద్ధమయ్యారని అన్నారు. ఉచితంగా భూములు రెగ్యులరైజ్ చేస్తామనీ.. ఎల్‌ఆర్‌ఎస్ ఎవరూ కట్టొద్దనిగతంలో చెప్పి ఇప్పుడెందుకు ఆ హామీని నెరవేర్చట్లేదని కేటీఆర్ నిలదీశారు. ముందుగా చెప్పినట్లుగానే ఎల్‌ఆర్ఎస్‌ ఉచితంగా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఉచితంగా ఎల్‌ఆర్ఎస్ చేయాలని బీఆర్ఎస్ పోరాడుతుందని కేటీఆర్ చెప్పారు. ఇందులో భాగంగానే ఈ నెల 6న రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్‌ ధర్నాలు చేస్తుందని చెప్పారు. హైదరాబాద్‌లో హెచ్‌ఎండీఏ ఆఫీపు ముందు ధర్నా చేస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలను కలిసి వినతి పత్రాలను అందిస్తామని కేటీఆర్ చెప్పారు. ఇక మార్చి 7న జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందిస్తామని అన్నారు. ఎల్‌ఆర్ఎస్‌ కట్టాలని అడుగుతున్న అధికారులను ప్రజలే నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Next Story