ఆ బుక్ మెయింటెన్ చేస్తున్నాం..అందరి చిట్టా విప్పుతాం: ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik
ఆ బుక్ మెయింటెన్ చేస్తున్నాం..అందరి చిట్టా విప్పుతాం: ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా సింగోటంలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి చెప్తున్నా.. కచ్చితంగా పింక్ బుక్ మెయింటెన్ చేస్తాం. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే ఎంత పెద్ద నాయకులైనా.. అధికారులనైనా వదిలిపెట్టేది లేదు. పింక్ బుక్కులో అందరి చిట్టా రాసుకుంటాం. మాకు కూడా టైం వస్తుంది. అప్పుడు అందరి సంగతి చెప్తాం..అని కవిత అన్నారు.
కొల్లాపూర్ నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ కార్యకర్తలను తీవ్రంగా వేధిస్తున్నారు. సోషల్ మీడియాలో చిన్న విమర్శ చేసినా, ప్రశ్నించినా అక్రమ కేసులు పెడుతున్నారు. శ్రీధర్ రెడ్డి అనే కార్యకర్తను దారుణంగా చంపేసినా కూడా పోలీసులు ఇప్పటివరకు కేసు దర్యాప్తును ముమ్మరం చేయడంలేదు. కాంగ్రెస్ నాయకులు హంతకులకు కొమ్ముకాస్తున్నారు. బీఆర్ఎస్ మీటింగ్ కోసం ఫ్లెక్సీలు కడితే పరమేశ్వర్ అనే కార్యకర్తపై మంత్రి జూపల్లి దాడి చేయించారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఇదేం రాజ్యం? కాంగ్రెస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారు? కొల్లాపూర్ నియోజకవర్గానికి జూపల్లి కృష్ణారావు టూరిస్టు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడో ఒకసారి మాత్రమే ఆయన నియోజకవర్గానికి వస్తున్నారు" అని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.