కేంద్ర మంత్రి అలా అనడం దారుణం: కవిత

మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇవ్వాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యతిరేకించడంపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

By అంజి  Published on  15 Dec 2023 5:34 AM GMT
MLC kavitha, smriti irani, National news, Telangana

కేంద్ర మంత్రి అలా అనడం దారుణం: కవిత

మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇవ్వాలన్న ప్రతిపాదనను కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ వ్యతిరేకించడంపై బీఆర్‌ఎస్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలో రుతుస్రావంపై స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలపై కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక మహిళగా ఇలాంటి అజ్ఞాన్ని చూడటం చాలా భయంకరంగా ఉందన్నారు. రుతుస్రావం అనేది ఛాయిస్‌ కాదని, అది ఒక బయాలజికల్‌ రియాలిటీ అని అన్నారు.

వేతనంతో కూడిన సెలవును తిరస్కరించడం చాలా మంది మహిళలు అనుభవించే నిజమైన బాధను విస్మరించినట్లేనని అన్నారు. మహిళలు ఎదుర్కొనే సమస్యల పట్ల సానుభూతి లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని కవిత ట్వీట్ చేశారు. ఒక మహిళగా.. మహిళలు ఎదుర్కొనే నిజమైన సవాళ్లు, ప్రతిదానికీ మనం ఎదుర్కోవాల్సిన పోరాటం పట్ల సానుభూతి లేకపోవడం విస్తుగొలిపే విష‌యం అని రాసుకొచ్చారు.

రుతుక్రమం సమయంలో సెలవు ఇవ్వాలా వద్దా అనే ప్రశ్నకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సమాధానమిస్తూ.. ఆ అవసరం లేదని అన్నారు. రుతుక్రమం అనేది మహిళ జీవితంలో సహజమైన అంశమని.. అది వైకల్యం కాదని కేంద్ర మంత్రి అన్నారు. మహిళలకు బహిష్టు సమయంలో సెలవులు ఇవ్వడానికి ఎలాంటి పాలసీ అవసరం లేదని ఆమె సూచించారు. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో రాజ్యసభలో ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా.. బహిష్టు సమయంలో మహిళలకు తప్పనిసరిగా వేతనంతో కూడిన సెలవు ఇవ్వడంపై ఏం చేశారని మంత్రిని ప్రశ్నించారు.

Next Story