బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనకు గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేత హరీష్ రావు సహా పార్టీ ముఖ్య నేతలు ఆసుపత్రికి చేరుకున్నారు. అస్వస్థతకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అప్డేట్ ఇచ్చారు.
మాగంటి గోపీనాథ్కు ఐసీయూలో చికిత్స జరుగుతోందని హరీష్ రావు తెలిపారు. సీనియర్ డాక్టర్లు మాగంటి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని.. త్వరలోనే మాగంటి కోలుకుంటారని హరీష్రావు తెలిపారు.
ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. మాగంటి ఆరోగ్యంపై ఎవరూ మానసిక ఆందోళనకు గురికావద్దన్నారు. మీడియా తప్పుడు సమాచారని అందించవద్దని కోరారు. మాగంటి గోపీనాథ్ క్రమంగా కోలుకుంటున్నారని.. ఇప్పటివరకూ ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. వైద్యానికి స్పందిస్తున్నారని.. ఇటీవల జరిగిన కొన్ని పరిస్థితుల వల్ల మాగంటి గోపీనాథ్ కొంత ఒత్తిడికి గురయ్యారని తెలిపారు. సర్దార్ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి ఆయన ఒత్తిడికి గురయ్యారని.. ఆయన పూర్తి ఆరోగ్యంగా బయటకు రావాలని కోరుకుంటున్నామన్నారు. అందరూ పూజలు చేయాలని కోరారు. మాగంటి 48 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని పేర్కొన్నారు.