పెండింగ్ బిల్లులు విడుదల చేయండి..మంత్రి సీతక్కకు హరీష్‌ రావు లేఖ

తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు.

By Knakam Karthik
Published on : 22 Jun 2025 5:32 PM IST

Telangana, Panchayat Raj Minister Sitakka, Brs Mla Harishrao, Congress Government

పెండింగ్ బిల్లులు విడుదల చేయండి..మంత్రి సీతక్కకు హరీష్‌ రావు లేఖ

తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. గ్రామాల్లో కుంటుపడిన పారిశుద్ద్యం, మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లుల చెల్లింపు, పంచాయతీ నిధుల విడుదల, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్దీకరణ, ఇతర సమస్యల గురించి లేఖలో ప్రస్తావించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధిలో భాగంగా 2019లో కేసీఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం 9,350 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించింది. ప్రభుత్వ ఆదేశానుసారం గ్రామ పంచాయతీల అభివృద్ది కోసం వారు ఎంతో శ్రమించారు. గ్రామ పంచాయతీలకు సకాలంలో నిధులు మంజూరు చేయడం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ అధికారుల కృషి వల్ల తెలంగాణ గ్రామాలు అభివృద్దిలో దేశానికే ఆదర్శంగా నిలిచాయి..అని హరీష్ రావు ఆ లేఖలో రాసుకొచ్చారు.

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పరిస్థితులు ఇందుకు భిన్నంగా మారాయి. నిధులు విడుదల లేకపోవడంతో గ్రామ పంచాయతీల అభివృద్ది ఎక్కడిక్కడే నిలిచిపోయింది. పారిశుద్ద్యం పడకేసింది. వీధి దీపాల నిర్వహణ లేక పల్లెలు అంధకారంలో ఉంటున్నాయి. చివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ పోయించలేక, ఆర్టీఏ టాక్స్ కట్టలేక అధికారులకు తాళాలు అప్పగిస్తున్న దుస్థితి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోయినప్పటికీ, పంచాయతీ అధికారులు అప్పులు తెచ్చి మరీ నిర్వహణ కొనసాగించే ప్రయత్నం చేసారు. ఒకవైపు రోజురోజుకీ అప్పులు పెరగటం, మరోవైపు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం వల్ల పంచాయతీ కార్యదర్శులపై ఆర్థిక భారం మరింత పెరిగింది. దీంతో వారు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తే నిధులు విడుదల మరింత కష్టతరం అవుతుందని బాధపడుతున్నారు. ఇదే విధంగా మాజీ సర్పంచులు సైతం చేసిన పనులకు బిల్లులు రాక తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

హరీష్ రావు డిమాండ్స్:

1. గ్రామ పంచాయతీలకు సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేయాలి.

2. చేసిన పనులకు గాను మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి.

3. “అభయహస్తం” మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరించాలి.

4. వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో స్పెషల్ డ్రైవులు నిర్వహించి, పారిశుద్ద్యం పెంపొందించాలి.

5. గత మూడు నెలలుగా పారిశుధ్య కార్మికులకు వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే వారికి వేతనాలు చెల్లించాలి.

6. గతేడాది నవంబర్ లో నిర్వహించిన ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇప్పటి వరకు వేతనాలు చెల్లించకపోవడం శోచనీయం. వెంటనే వారి వేతనాలు విడుదల చేయాలి.

Next Story