హైదరాబాద్: పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారిపై వేటు వేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. కేటీఆర్ పిటిషన్పై జస్టిస్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే ఈ పిటిషన్ను గతంలో దాఖలైన పిటిషన్కు ట్యాగ్ చేసిన ధర్మాసనం ఈ నెల 10వ తేదీన పాత దానితో కలిపి విచారిస్తామని వెల్లడించింది. ఇప్పటికే తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరిపై సుప్రీంలో విచారణ జరుగుతోంది. జనవరి 31న ఈ పిటిషన్పై సుప్రీంలో విచారణ జరిగింది.
తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టి.ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం.సంజయ్ కుమార్పై బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. ఇదిలా ఉంటే.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం వెలువరించడానికి హేతుబద్ధంగా ఎంత సమయం కావాలో చెప్పాలని సుప్రీంకోర్టు తెలంగాణ శాసనసభ స్పీకర్ను కోరిన విషయం తెలిసిందే. వారం రోజుల్లోగా స్పీకర్ నిర్ణయాన్ని తమకు తెలుపాలని అసెంబ్లీ కార్యదర్శి ముకుల్ రోహత్గీకి ఆదేశాలు ఇచ్చింది.