ఇంటర్ పాఠ్యపుస్తకాల పంపిణీలో ప్రభుత్వం విఫలం: హరీష్‌ రావు

ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాలు అందించడంలో కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్ సీనియర్ నేత టీ హరీశ్ రావు మండిపడ్డారు.

By అంజి  Published on  19 Jun 2024 6:31 AM GMT
BRS, Harish Rao , Telangana govt , Inter textbooks

ఇంటర్ పాఠ్యపుస్తకాల పంపిణీలో ప్రభుత్వం విఫలం: హరీష్‌ రావు

హైదరాబాద్: జూనియర్ కాలేజీలు తెరిచినా విద్యార్థులకు ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాలు అందించడంలో కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) సీనియర్ నేత టీ హరీశ్ రావు మండిపడ్డారు. ప్రక్రియలో జాప్యాన్ని "బాధ్యతా రహితం" అని ఆయన అన్నారు.

''రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు ప్రారంభమై 19 రోజులు అవుతున్నా, ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం బాధ్యతారాహిత్యం. ప్రజా పాలన అని ప్రచారం చేసుకునే ఈ ప్రభుత్వానికి విద్య మీద, విద్యార్థుల భవిష్యత్తు మీద ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. 422 జూనియర్ కాలేజీల్లో లక్షా 60 వేల మంది పేద, బలహీన వర్గాల విద్యార్థులు చదువుతున్నారు. వారికి నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం విఫలమైంది'' అని బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌ రావు ఆరోపించారు.

''రాష్ట్రంలోని కొన్ని జూనియర్ కాలేజీల్లో మొదటి ఏడాది జీరో అడ్మిషన్స్ నమోదవడం పట్ల ప్రభుత్వం దృష్టి సారించి ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలి. పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు, జూనియర్ కాలేజీల్లో విధులు నిర్వర్తించే 1654 గెస్ట్ ఫ్యాకల్టీ రెన్యువల్ చేయాలని, రాష్ట్రంలో కొత్తగా మంజూరైన జూనియర్ కాలేజీల్లో పోస్టులు మంజూరు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం'' అని ఎక్స్‌లో చేసిన పోస్టులో హరీష్‌ రావు పేర్కొన్నారు.

Next Story