కాంగ్రెస్‌లా చిల్లర రాజకీయాలు చేయను: హరీశ్‌ రావు

తనను ఎదుర్కొనే ధైర్యం లేకనే పీసీసీ చీఫ్‌ మహేశ్‌ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌ రావు మండిపడ్డారు.

By అంజి
Published on : 31 May 2025 1:03 PM IST

BRS, Harish Rao, TPCC chief, petty politics, Telangana

కాంగ్రెస్‌లా చిల్లర రాజకీయాలు చేయను: హరీశ్‌ రావు

హైదరాబాద్‌: తనను ఎదుర్కొనే ధైర్యం లేకనే పీసీసీ చీఫ్‌ మహేశ్‌ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌ రావు మండిపడ్డారు. రేవంత్‌ బాటలోనే ఆయన కూడా విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఏదైనా పెళ్లి, చావు సందర్భాల్లో తప్ప.. మహేష్‌ ఆరోపించినట్టు తాను ఇతర పార్టీ నాయకులను ఎప్పుడూ కలవలేదన్నారు. ఇలాంటి ఆరోపణలు మానుకుని స్థాయికి తగ్గట్టు ఉండాలన్నారు. తాను మీలాగా చిల్లర రాజకీయాలు చేయనని ఫైర్‌ అయ్యారు.

''పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉండి మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న చిల్లర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సూటిగా ఎదుర్కొనే ధైర్యం లేక దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. విలువలకు తిలోదకాలు ఇచ్చి, రేవంత్‌ రెడ్డి బాటలోనే మీరూ నడుస్తున్నారు. బట్ట కాల్చి మీద వేసినంత మాత్రానా అబద్దాలు, నిజం అయిపోవు. పెళ్ళి లోనో, చావు లోనో కలిసిన సందర్భాలే తప్ప మీరు ఆరోపించినట్లు ఇతర పార్టీ నాయకులను గానీ, మా పార్టీ నుంచి వెళ్లిన నాయకులను గాని ఎప్పుడూ వ్యక్తిగతంగా కలిసింది లేదు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాను తప్ప, మీ లాగా చిల్లర రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని చూడను. ఇలాంటి ఆరోపణలు మానుకొని, స్థాయికి తగ్గట్లు వ్యవహరించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు పై దృష్టి పెట్టాలని మహేష్ కుమార్ గౌడ్ కు సూచిస్తున్నాం'' అని హరీశ్‌ రావు ట్వీట్‌ చేశారు.

అంతకుముందు కాళేశ్వరం స్కామ్‌ నుంచి బయటపడేందుకు కేసీఆర్‌, హరీశ్‌ రావుతో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ చేతులు కలుపుతున్నారని రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. హరీశ్‌ను కలిసి కేసీఆర్‌తో ఈటల ఫోన్‌లో మాట్లాడారని పేర్కొన్నారు. ఈటల బీజేపీలో ఉన్నారా? బీఆర్‌ఎస్‌లోనా అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ దోస్తీ గురించి కవిత ఇప్పుడు బయటపెట్టారు.. కానీ ఈ దోస్తీకి అడ్డుగా ఉన్నందుకే బండి సంజయ్‌ను బీజేపీ స్టేట్‌ చీఫ్‌ పదవి నుంచి తొలగించారని మహేష్‌ కుమార్‌ ఆరోపించారు.

Next Story