బస్సు చార్జీల పెంపు ఎంతో దూరంలో లేదు: కేటీఆర్

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు.

By Srikanth Gundamalla  Published on  15 July 2024 5:54 AM GMT
brs, ktr, tweet,  ksrtc, bus charges, hike, Telangana govt ,

బస్సు చార్జీల పెంపు ఎంతో దూరంలో లేదు: కేటీఆర్ 

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. కర్ణాటకలో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు ప్రతిపాదనను ప్రస్తావిస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఎక్స్‌ వేదికగా ఈ మేరకు పోస్టు చేసిన ఆయన.. ఏదైనా ఉచితంగా ఇస్తామంటున్నారంటే మరో ఆలోచనతో తీసుకెళ్తారని చెప్పారు. ఉచితంగా ఇస్తామని చెబుతున్నారంటే భారీగా చెల్లించుకోక తప్పదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బస్సు చార్జీల పెంపుపై కర్ణాటకను తెలంగాణ ప్రభుత్వం అనుకరించే రోజు ఎంతో దూరంలో లేదని ఎక్స్‌లో రాసుకొచ్చారు కేటీఆర్.

కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చింది. అదే విధంగా తెలంగాణలో కూడా ఇదే తరహాలో మహాలక్ష్మి పథకం అమలు చేస్తోంది. తాజాగా కర్ణాటకలో బస్సు టికెట్‌ చార్జీలను పెంచేందుకు కేఎస్ఆర్‌టీసీ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ బస్సుల్లో చార్జీల పెంపు అనివార్యమని రాష్ట్ర కర్ణాటక రాష్ట్ర రవాణా కార్పొరేషన్ తెలిపింది. 15 నుంచి 20 శాతం మేర ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు.

ఈ మేరకు కర్ణాటక ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ.. 'ఇంధనం, ఆటో విడివిభాగాల ధరలు బాగా పెరిగాయి. 2019 నుంచి బస్సుల్లో టికెట్ చార్జీలను పెంచలేదు. 2020 నుంచి కేఎస్ ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ జరగలేదు. అందుకే టికెట్‌ ధరలు పెంచడం తప్పడం లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. తెలంగాణలో కూడా ఆర్టీసీ చార్జీలు ఇలాంటి రీజన్స్‌ చెప్పి పెంచుతారని పేర్కొన్నారు.

Next Story