ఎంపీగా ఈటల గెలుస్తారన్న మల్లారెడ్డి కామెంట్‌పై కేటీఆర్ స్పందన ఇదే..

మల్లారెడ్డి చేసిన కామెంట్స్‌పై బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బీ

By Srikanth Gundamalla  Published on  27 April 2024 11:06 AM GMT
brs, ktr, comments,  malla reddy, etela rajender, telangana,

ఎంపీగా ఈటల గెలుస్తారన్న మల్లారెడ్డి కామెంట్‌పై కేటీఆర్ స్పందన ఇదే..

మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో జరిగిన ఓ వివాహ వేడుకకు శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు, బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌రెడ్డి హాజరు అయ్యారు. ఈ సందర్భంగా వీరిరువురూ కలుసుకుని కరచాలనం చేసుకున్నారు. గత రోజులను గుర్తు చేసుకున్నారు. కలిసి ఒక ఫొటో కూడా దిగారు. ఈ క్రమంలోనే మల్లారెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మల్కాజ్‌గిరి ఈసారి గెలిచేది నువ్వే అన్నా.. అంటూ ఈటల రాజేందర్‌ను ఉద్దేశించి కామెంట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అయ్యింది. ప్రత్యర్థి అభ్యర్థికి అనుకూలంగా కామెంట్స్ చేయడంతో బీఆర్ఎస్ నాయకులు కూడా ఒకింత షాక్‌ తిన్నారు.

తాజాగా మల్లారెడ్డి చేసిన కామెంట్స్‌పై బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను తెలంగాణ భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు కేటీఆర్. మల్లారెడ్డి తన రాజకీయ అనుభవంతోనే ఈటలపై అలాంటి కామెంట్స్ చేశారని కేటీఆర్ చెప్పారు. ఈటలను మునగ చెట్టు ఎక్కించి కింద పడేయాలన్నది మల్లారెడ్డి వ్యూహం అని చెప్పారు కేటీఆర్. ఈ విషయంలో మల్లారెడ్డి తన రాజకీయ అనుభవాన్ని చాటుకున్నారంటూ చెప్పుకొచ్చారు. అయితే.. మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థిగా గెలిచేంది కచ్చితంగా తమ పార్టీకి చెందిన వారే అన్నారు. ఈ విషయం ఈటలకు కూడా తెలుసన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మల్లారెడ్డి అలా మాట్లాడటం వెనుక అసలు విషయం తెలియనవారు మాత్రమే ఎద్దేవా చేస్తున్నారని కేటీఆర్ అన్నారు.

కొందరు నాయకులు తమ స్వార్థం కోసమే పార్టీని వీడుతుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నాయకులు మాత్రమే పార్టీలు మారుతారనీ.. కార్యకర్తలు ఎప్పుడూ పార్టీ కోసం పనిచేస్తుంటారని అన్నారు. బీఆర్ఎస్‌లోనే తనకు గౌరవం ఉండేదనీ.. పార్టీ మారిన తర్వాత ఈటల రాజేందర్ స్వయంగా చెప్పారని గుర్తు చేసుకున్నారు. పార్టీ మారిన కేకే, రంజిత్‌రెడ్డి పరిస్థితి కూడా ఎలా ఉందో అందరికీ తెలుసన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కష్ట కాలంలో పార్టీ ఉన్నప్పుడు వెంటే ఉండేవాడినే నాయకుడు అంటారనీ.. కష్టం వచ్చిందని పారిపోయే వారిని ఏమంటారో చెప్పాలన్నారు. వారు లీడర్లు ఎలా అవుతారని కేటీఆర్ ప్రశ్నించారు. పార్టీ మారి ఎన్నికల్లో నిలబడ్డ వారిని ఓడించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Next Story