బండి సంజయ్‌ను పార్లమెంట్‌కు అనర్హులుగా ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్

హైదరాబాద్: 10వ తరగతి పేపర్ లీక్ కేసులో అరెస్టయిన కరీంనగర్ లోక్‌సభ ఎంపీ బండి సంజయ్ కుమార్‌పై అనర్హత వేటు

By అంజి  Published on  5 April 2023 8:58 AM GMT
BRS , Bandi Sanjay, Parliament

బండి సంజయ్‌ను పార్లమెంట్‌కు అనర్హులుగా ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్

హైదరాబాద్: 10వ తరగతి పేపర్ లీక్ కేసులో అరెస్టయిన కరీంనగర్ లోక్‌సభ ఎంపీ బండి సంజయ్ కుమార్‌పై అనర్హత వేటు వేయాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) బుధవారం డిమాండ్ చేసింది. రాష్ట్ర మంత్రులు, ఇతర బీఆర్‌ఎస్‌ నాయకులు.. బండి సంజయ్‌పై లోక్‌సభ స్పీకర్ తక్షణమే చర్య తీసుకోవాలని, తీవ్రమైన నేరానికి పాల్పడినందుకు సంజయ్‌పై అనర్హత వేటు వేయాలని అన్నారు. బీజేపీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు కూడా అయిన సంజయ్‌ను పోలీసులు కరీంనగర్‌లో అర్ధరాత్రి తర్వాత అరెస్టు చేశారు. ఇవాళ సాయంత్రం వరంగల్‌లోని కోర్టులో హాజరుపరచనున్నారు.

సంజయ్‌పై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను అభ్యర్థిస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి టి.హరీష్ రావు తెలిపారు. సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (ఎస్‌ఎస్‌సి) హిందీ ప్రశ్నపత్రం లీకేజీలో సంజయ్‌ సూత్రధారి అని హరీశ్‌రావు అభివర్ణిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడని పేర్కొన్నారు. రాజకీయంగా బీఆర్‌ఎస్‌తో పోరాడలేక బీజేపీ నేత పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. 'బీజేపీ రాజకీయాలు కొత్త స్థాయికి చేరాయి. రాజకీయ ప్రయోజనాల కోసం వారు ఏ స్థాయికైనా దిగజారుతున్నారు' అని ఆయన అన్నారు.

మంగళవారం వరంగల్‌లో ప్రశ్నపత్రం లీక్‌పై అరెస్టయిన ప్రశాంత్‌ బీజేపీ కార్యకర్త అని, బండి సంజయ్‌కు పేపర్‌ పంపించాడని హరీశ్‌రావు తెలిపారు. "ఇది ప్రభుత్వం పరువు తీసేందుకు జరిగిన కుట్ర, కానీ అతను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు" అని మంత్రి అన్నారు. పేపర్‌ లీక్‌ కేసులో అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం మధ్యాహ్నం వరంగల్‌లో బీజేపీ నేతలు నిరసనకు దిగారని, అయితే సాయంత్రం నిందితులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారని అన్నాడు.

నిందితుడు బండి సంజయ్‌కు తన మొబైల్‌లో పలుమార్లు ఫోన్ చేసి, ప్రభుత్వ పరువు తీసేలా లీక్ అయిన ప్రశ్నపత్రాన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేశారని మంత్రి తెలిపారు. సోమవారం తాండూరులో తెలుగు ప్రశ్నపత్రం లీకేజీ వెనుక కూడా బండి సంజయ్ హస్తం ఉందని ఆర్థిక మంత్రి ఆరోపించారు. పరీక్షా కేంద్రంలో ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి వాట్సాప్‌లో షేర్ చేసిన ఉపాధ్యాయుడు బీజేపీ మద్దతు ఉన్న ఉపాధ్యాయ సంఘం నాయకుడని తెలిపారు.

మంత్రులు శ్రీనివాస్ గౌడ్, పి. అజయ్ కుమార్, పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా సంజయ్‌పై పార్లమెంట్‌కు అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ వేర్వేరుగా విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. పేపర్ లీకేజీకి సంబంధించి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నపత్రాలు లీక్ చేస్తూ అమాయక విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని మంత్రి కెటిఆర్‌ ఆరోపించారు. “పిచ్చివాడి చేతిలో రాయి ఉంటే దారిన పోయేవారికి ప్రమాదం, అదే పిచ్చివాడి చేతిలో పార్టీ ఉంటే అది ప్రజాస్వామ్యానికే ప్రమాదం” అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న కేటీఆర్ ట్వీట్ చేశారు.

Next Story