యెస్ బాస్ అంటే జైలుకు పోతారు జాగ్రత్త, అధికారుల తీరుపై ఈటల హాట్ కామెంట్స్
ఐఏఎస్ అధికారులు రాజకీయ నాయకుల బానిసల్లా వ్యవహరించొద్దని హెచ్చరించారు.
By Knakam Karthik
యెస్ బాస్ అంటే జైలుకు పోతారు జాగ్రత్త, అధికారుల తీరుపై ఈటల హాట్ కామెంట్స్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల తీరుపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ, ఐఏఎస్ అధికారులు రాజకీయ నాయకుల బానిసల్లా వ్యవహరించొద్దని హెచ్చరించారు. ప్రభుత్వాలు ఐదేళ్లపాటు మాత్రమే ఉంటాయి, కానీ ఐఏఎస్ అధికారులు 35 ఏళ్ల పాటు పరిపాలనలో ఉంటారని, కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థకు అనుగుణంగా విధులు నిర్వహించాలని సూచించారు.
ఈటల తన ప్రసంగంలో, గతంలో ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా పని చేసిన కొన్ని అధికారులు తీవ్ర పరిణామాలను ఎదుర్కొన్నట్లు గుర్తుచేశారు. రాజకీయ నాయకుల మాటలకే లోబడిపోయి అధికార దుర్వినియోగానికి పాల్పడితే, వారి భవిష్యత్తుపై దుష్ప్రభావం పడుతుందని హెచ్చరించారు. అధికార యంత్రాంగం న్యాయబద్ధంగా పని చేయాలని, కేవలం అధికార పార్టీల ఆదేశాలకు లోబడకూడదని సూచించారు.
ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారికి కఠిన చర్యలు తప్పవని ఈటల స్పష్టం చేశారు. తాము కాషాయ బుక్ మెయింటైన్ చేస్తున్నామని, ఎవరైనా అధికార దుర్వినియోగానికి పాల్పడితే, భవిష్యత్తులో కచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజా సేవకులుగా వ్యవహరించాల్సిన అధికారులు, పాలక వర్గాలకు కొమ్ముకాస్తే జైలు పాలవ్వాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.