కేటీఆర్‌ ఢిల్లీ టూర్‌కు రాజకీయ రంగు పులమొద్దు: బండి సంజయ్

మంత్రి కేటీఆర్ హస్తిన పర్యటనకు రాజకీయ రంగు పులమొద్దని బండి సంజయ్ చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం..

By Srikanth Gundamalla  Published on  23 Jun 2023 1:59 PM GMT
BJP, Bandi Sanjay, KTR, Delhi Tour

కేటీఆర్‌ ఢిల్లీ టూర్‌కు రాజకీయ రంగు పులమొద్దు: బండి సంజయ్

ప్రస్తుతం మంత్రి కేటీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. అయితే.. ఆయన పర్యటనలో వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. తాజాగా కేటీఆర్‌ హస్తిన టూర్‌పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పందించారు. కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదని అందరికీ తెలిసేలా చేసేందుకే ఢిల్లీ వెళ్లారన్న వార్తలను ఆయన ఖండించారు. రాజకీయ పార్టీలు వేరు.. ప్రభుత్వం వేరని అన్నారు బండి సంజయ్.

మంత్రి కేటీఆర్ హస్తిన పర్యటనకు రాజకీయ రంగు పులమొద్దని బండి సంజయ్ చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం కావాల్సిన సాయం అందించిందని తెలిపారు. రాష్ట్రాల అభివృద్ధి కోసం ఎవరెళ్లినా కేంద్ర పెద్దలు అపాయింట్‌మెంట్‌ ఇస్తారని చెప్పారు. కేంద్రమంత్రులను తెలంగాణ మంత్రి కేటీఆర్ కలవడం సాధారణ విషయమే అన్నారు. దీనికి రాజకీయ రంగు పులిమి పెద్ద విషయంగా మార్చొద్దని కోరారు. బీజేపీ కార్యకర్తలను చంపించిన మమతాబెనర్జీకి కూడా కేంద్ర పెద్దలు సమయం ఇచ్చారని గుర్తుచేశారు. కేంద్రంలో ఉన్న నాయకులు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తారని మరోసారి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించడం లేదన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను బండి సంజయ్ ఖండించారు. కేసీఆర్‌ తన పాలనలో తెలంగాణలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దశాబ్ధి ఉత్సవాల పేరుతో బీఆర్‌ఎస్ నాయకులు బెదిరింపులకు పాల్పడ్డారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను ఏ మాత్రం ఆదరించడం లేదన్నారు. ఆ విషయం టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి దుబ్బాక, హుజూరాబాద్‌ ఉపఎన్నికల ఫలితాలతో అర్థమైందని బండి సంజయ్ చెప్పారు.

Next Story