ఆ కేసులో బండి సంజయ్కు హైకోర్టులో ఊరట
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు తెలంగాణ హైకోర్టులో రిలీఫ్ దక్కింది.
By Knakam Karthik
ఆ కేసులో బండి సంజయ్కు హైకోర్టులో ఊరట
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు తెలంగాణ హైకోర్టులో రిలీఫ్ దక్కింది.గతంలో బండి సంజయ్పై నమోదైన ఒక కేసును ఉన్నత న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. 2021 నవంబర్ నమోదైన ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. 2021లో బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.
ఈ సందర్భంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపణలు రాగా, సూర్యాపేట జిల్లా పెన్పహాడ్కు చెందిన అప్పటి తహసీల్దార్ శేషగిరిరావు నవంబర్ 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పెన్పహాడ్ పోలీసులు బండి సంజయ్పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన ఎన్నికల ప్రచార నిబంధనలను అతిక్రమించి, వడ్ల కొనుగోలు కేంద్రాల సందర్శన పేరుతో ఎన్నికల ప్రచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి.
అప్పటి నుంచి ఈ కేసు హైదరాబాద్లోని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ దశలో పెండింగ్లో ఉంది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును తెలంగాణ హైకోర్టు విచారించగా.. ఈ ఆరోపణలకు ఆధారాలు లేవని, ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగినట్లు నిరూపించబడలేదని బండి తరపు న్యాయవాదులు వాదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఈ కేసును సరైన సాక్ష్యాధారాల నిరూపణ లేని కారణంగా కొట్టివేసింది. బీజేపీ నాయకులు ఈ తీర్పును స్వాగతిస్తూ, ఈ కేసు రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమని ఆరోపించారు.