తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 27 వరకు కొనసాగించాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది. శాసనసభ స్పీకర్ ప్రసాద్కుమార్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బడ్జెట్ సమావేశాలను ఈ నెల 27 వరకు నిర్వహించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా 19న ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సభలో 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 13న (గురువారం) గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగనుంది. 14న హోలీ సందర్భంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ఈ నెల 21 నుంచి 26 వరకు వివిధ పద్దులపై సభలో వాడీవేడి చర్చ జరగనుంది. 27న ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపనుంది.
అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో నిర్వహించిన బీఏసీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు , వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. కాగా, రూ.3.20 లక్షల కోట్లతో రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఆర్థిక శాఖ రెడీ చేసినట్లుగా తెలుస్తోంది.