సంచలనం సృష్టించిన సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేతావత్ చందు రాథోడ్ హత్యకేసులో ప్రమేయం ఉన్న నిందితులను మలక్పేట పోలీస్ స్టేషన్, సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య జూలై 15, 2025న హైదరాబాద్ నగరం, సౌత్ ఈస్ట్ జోన్లోని మలక్పేట్ PS పరిధిలోని మూసారాంబాగ్లోని శాలివాహన నగర్ GHMC పార్క్ వద్ద సుమారు 07:20 గంటలకు జరిగింది.
ఆర్థిక వ్యవహారాలు, రాజకీయ విభేదాల కారణంగా కేతావత్ చందు రాథోడ్ను అంతమొందించాలనకున్నాడు A1 దొంతి రాజేష్. మృతుడు చందు రాథోడ్.. రాజేష్ అనుచరుల వద్ద డబ్బులు వసూలు చేయడంతోపాటు అక్రమసంబంధం వ్యవహారం విషయంలో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు రాజేష్. ఈ క్రమంలోనే పక్క స్కెచ్ వేసి అతడిని అంతమొందించాడని పోలీసులు తెలిపారు.
నిందితులు ఆయుధాలు, కారంపొడి ఉపయోగించి హత్యకు పథకం పన్నారని పోలీసుల విచారణలో తేలింది. నిందితులు అర్జున్ జ్ఞాన ప్రకాష్(ఏ4), లింగిబేడి రాంబాబు(ఏ5)లను నెల్లూరు వైపు పారిపోతుండగా కావలి సమీపంలో, రాజేష్(ఏ1), కుంబ ఏడుకొండలు(ఏ2)లను వరంగల్ జిల్లా జనగాంలో అరెస్టు చేశారు పోలీసులు. కాగా ఈ కేసుల శ్రీను(ఏ3), కందుకూరి ప్రశాంత్(ఏ6)లు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. పోలీసులు హత్యకు పాల్పడిన వాహనం బూడిద రంగు స్విఫ్ట్ కారుతోపాటు నిందితులు వాడిన పిస్టల్, రివాల్వర్లను స్వాధీనం చేసుకున్నారు.