తెలంగాణలో వచ్చినట్టే.. కేంద్రంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టే కేంద్రంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అశాభావం వ్యక్తం చేశారు.
By Medi Samrat
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టే కేంద్రంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అశాభావం వ్యక్తం చేశారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన సామాజిక న్యాయ సమరభేరి సభలో ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తల కృషితోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని.. కేసీఆర్ కాకుండా ఇంకో పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాదన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు.. కార్యకర్తలు కష్టపడి మిగతా పార్టీలను ఓడించి కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలకు అందుతున్నాయన్నారు. కార్యకర్తలు కాంగ్రెస్ ఆత్మ.. మనం అధికారంలోకి రావడానికి కారణం మీరే.. మీ వల్లే రాష్ట్రంలో అధికారం వచ్చిందన్నారు. రాహుల్ పాదయాత్ర సమయంలోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అర్థమైందన్నారు. హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనేకం ఉన్నాయి. ఆ సంస్థలన్నీ తెచ్చింది గత కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు.
నల్లధనం తెచ్చి ప్రతి వ్యక్తికి 15 లక్షలు ఇస్తానని మోదీ అన్నాడు.. ఏమైంది? మోదీ చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు. మోదీ, షా అబద్ధాలు చెప్పి ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారన్నారు. తెలంగాణలో విద్యా, వ్యవసాయం లాంటి అనేక కీలక రంగాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి.. ఫ్రీ కరెంట్, ఉచిత బస్సు, సన్న బియ్యం ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. గత ప్రభుత్వం అమ్మే బియ్యం ఇచ్చేది.. కాంగ్రెస్ ప్రభుత్వం తినే బియ్యం ఇస్తోందన్నారు.
తెలంగాణ దేశానికి ఆదర్శం కాబోతుందన్నారు. మేం చెప్పినవన్నీ ఇచ్చి చూపించాం.. అబద్ధాలు చెప్పి కొందరు ఓట్లు అడుగుతారు.. మేం అభివృద్ధి, సంక్షేమం చేసి ఓట్లు అడుగుతామన్నారు.
తెలంగాణలో విద్యా సంస్థల్లో రోహిత్ వేముల చట్టాన్ని తెస్తున్నామన్నారు. తెలంగాణలో కుల గణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచాం.. వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామన్నారు.. బీఆర్ఎస్ హయాంలో ఎంత అవినీతి ఉండేదో మీకు తెలుసు.. కాంగ్రెస్ వచ్చాక అవినీతి పూర్తిగా తగ్గిపోయిందన్నారు. హైదరాబాద్లో కనీసం 25 ప్రభుత్వ సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వాలు తెచ్చాయి.. హైదరాబాద్ కి మోదీ చేసింది ఏంటో బీజేపీ చెప్పాలన్నారు.