సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల తహశీల్దార్ కామతం శ్రవణ్ కుమార్పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పంజా విసిరింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో శ్రవణ్ కుమార్ నివాసంతో పాటు మరో రెండు చోట్ల అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో కరీంనగర్ పట్టణంలో రెండు ఇళ్లు, ఆరు ఫ్లాట్లతో కూడిన భారీ అపార్ట్మెంట్, నాలుగు ఓపెన్ ప్లాట్లు, ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు మరియు నగదును అధికారులు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ. 4 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు.
తన అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమ మార్గాల్లో ఈ ఆస్తులను సంపాదించినట్లు ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం తహశీల్దార్కు సంబంధించిన ఇతర డాక్యుమెంట్లపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని, త్వరలోనే నిందితుడిని అరెస్టు చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లా రెవెన్యూ వర్గాల్లో ఈ దాడి కలకలం రేపింది.