హైదరాబాద్: ఊహించినట్లుగానే తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా బరిలో నిలిచిన కాంగ్రెస్ నేతలు అభిషేక్ మను సింఘ్వీ, వేమ్ నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన మార్చి 9న, ఇతర అభ్యర్థులెవరూ పోటీలో లేకపోవడంతో వీరిద్దరి ఎన్నికను అధికారులు అధికారికంగా ప్రకటించారు. అంతకుముందు దాఖలైన మరో అభ్యర్థి నామినేషన్ పత్రంలో తగినంత మంది ప్రతిపాదకుల మద్దతు లేకపోవడంతో దానిని తిరస్కరించారు.
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని కాంగ్రెస్ అధిష్ఠానం మరోసారి తెలంగాణ నుంచి నామినేట్ చేసింది. గతంలో బీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో సింఘ్వీ ఏడాదిన్నర కాలం పాటు బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు పూర్తి కాలానికి ఆయన మళ్లీ ఎన్నికయ్యారు. ఇక వేమ్ నరేందర్ రెడ్డి విషయానికొస్తే.. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తమిత్రుడు. గతంలో టీడీపీలో ఉన్నప్పటి నుండి రేవంత్ రెడ్డితో కలిసి నడుస్తున్న నరేందర్ రెడ్డి, ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు.
మార్చి 5న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వీరిద్దరూ నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికైన అనంతరం వేమ్ నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభలో తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడుతానని, రాష్ట్ర అవసరాలను జాతీయ స్థాయిలో గట్టిగా వినిపిస్తానని ఆయన స్పష్టం చేశారు.