600 leaders and activists from Congress join TRS in Khammam. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లోని 57వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.
By Medi Samrat Published on 27 Feb 2022 3:41 PM GMT
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లోని 57వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కాంగ్రెస్కు చెందిన సుమారు 600 మంది నాయకులు, కార్యకర్తలు ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. ఆదివారం ఇక్కడ టీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ గూటికి చేరికలు జరిగాయి. టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకులలో కొరివి దయానంద్, ఇమాన్ ఉన్నారు.
ఈ సందర్భంగా మంత్రి అజయ్కుమార్ మాట్లాడుతూ.. ఖమ్మంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. నగరంలోని మున్సిపల్ డివిజన్లలో ప్రతి నివాస ప్రాంతంలో సిసి రోడ్లు, డ్రైన్లు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తగినన్ని నిధులు విడుదల చేయడంతో గత కొన్నేళ్లుగా నగర రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని అన్నారు.
మిషన్ భగీరథ కింద ఇంటింటికీ కుళాయి కనెక్షన్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నామని.. ఒక్కో మున్సిపల్ డివిజన్లో సగటున రూ.11 కోట్లు ఖర్చు చేయగా.. కొన్ని డివిజన్లలో దాదాపు రూ.25 కోట్ల వరకు అభివృద్ధి పనులకు వెచ్చించారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఆపలేరని అజయ్ కుమార్ ప్రతిపక్షాలనుద్దేశించి అన్నారు. ఒకప్పుడు రమణగుట్ట వంటి పేద నివాస కాలనీలు ఇప్పుడు సంపన్న కాలనీలుగా మారాయని.. అభివృద్ధి పనుల వల్ల భూముల విలువ చాలా రెట్లు పెరిగిందని ఆయన అన్నారు.