తెలంగాణలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అకౌంట్ లో చూస్తే 473 కోట్ల రూపాయలు కనిపిస్తూ ఉండగా.. విత్ డ్రా చేస్తే మాత్రం వంద రూపాయలు కూడా రావడం లేదు. ఏటీఎం మెషీన్ ది తప్పేమో అనుకున్నాడు.. ఇంకో ఏటీఎం మెషీన్ లో చూశాడు.. అక్కడ కూడా అకౌంట్ లో 473 కోట్ల రూపాయలు ఉన్నట్లే చూపిస్తోంది. కానీ డబ్బులు విత్ డ్రా కొడుతుంటే చిల్లి గవ్వ కూడా రావట్లేదు. ఓ రైతు అకౌంట్ విషయంలో చోటు చేసుకున్న గందరగోళం ఇది.
యాదాద్రి భువనగిరి జిల్లా గంధమల గ్రామానికి చెందిన అనుమూల సంజీవరెడ్డి అనే రైతుకు దక్కన్ గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. అతను బుధవారం నాడు జగదేవ్ పూర్ కు ఓ పని నిమిత్తం వెళ్లి, తన అవసరార్థం డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్లాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా డబ్బు రాలేదు. బ్యాలెన్స్ చూసుకోగా రూ. 473,13,30,000 ఉన్నట్టు చూపించింది. దగ్గర్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో చెక్ చేసుకున్నా, అంతే బ్యాలెన్స్ ఉన్నట్టు చూపింది. తన ఖాతాలో అంత డబ్బు ఎవరు వేశారన్న విషయాన్ని కనుక్కునేందుకు తన ఖాతా ఉన్న బ్యాంకుకు వెళ్ళాడు. సదరు రైతు ఖాతా ఫ్రీజ్ అయిందని అధికారులు వెల్లడించారు. అతని ఖాతాలో కేవలం రూ. 4 వేలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. బ్యాంకు ఉద్యోగులు చేసిన తప్పుకు ఇలా అన్ని కోట్ల రూపాయలు రైతు అకౌంట్ లో చేరాయి.