ఖతార్‌లో నలుగురు తెలంగాణ కార్మికులు మృతి.. ఫిఫా వరల్డ్‌కప్‌ ప్రాజెక్ట్‌ల కోసం పని చేస్తుండగా..

4 workers from Telangana died while working for FIFA World Cup projects in Qatar. ఖతార్‌లో ఫిఫా వరల్డ్‌కప్ ప్రాజెక్ట్‌లలో పనిచేస్తుండగా తెలంగాణకు చెందిన

By అంజి
Published on : 21 Oct 2022 11:49 AM IST

ఖతార్‌లో నలుగురు తెలంగాణ కార్మికులు మృతి.. ఫిఫా వరల్డ్‌కప్‌ ప్రాజెక్ట్‌ల కోసం పని చేస్తుండగా..

ఖతార్‌లో ఫిఫా వరల్డ్‌కప్ ప్రాజెక్ట్‌లలో పనిచేస్తుండగా తెలంగాణకు చెందిన నలుగురు కార్మికులు మరణించారని, అయితే వారి కుటుంబాలకు పరిహారం చెల్లించడానికి అరబ్ దేశం నిరాకరించిందని తెలంగాణ పార్లమెంటు సభ్యుడు రంజిత్‌రెడ్డి గురువారం అన్నారు. ఖతార్‌ నుంచి నష్టపరిహారం ఇప్పించి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని చేవెళ్ల నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడు రంజిత్‌రెడ్డి ప్రధాని మోదీకి, విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు.

దోహాలో ఫిఫా ప్రపంచ కప్ ప్రాజెక్టులలో పనిచేస్తున్న తెలంగాణ వలస కార్మికుల జీవితాలు అంత చౌకగా ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు. ఫిఫా ప్రాజెక్ట్‌లలో పనిచేస్తున్నప్పుడు మరణించిన వారికి పరిహారం చెల్లించడానికి ఖతార్ నిరాకరించింది. వలస కార్మికుల శవాలపై దోహా ఫిఫా ప్రపంచ కప్ నిర్వహించాలనుకుంటున్నారా? అని ఎంపీ రంజిత్‌రెడ్డి ప్రశ్నించారు. మల్లాపూర్ గ్రామానికి చెందిన జగన్ సూరుకంటి, ధర్పల్లికి చెందిన మాజిద్, మెండోరా గ్రామానికి చెందిన మధు బొల్లాపల్లి, వెల్మల్‌కు చెందిన కల్లాడి రమేష్ ఫిఫా ప్రాజెక్టుల్లో పనిచేస్తూ మరణించారని రంజిత్ రెడ్డి ట్వీట్ చేశారు.

"వారికి ఎటువంటి పరిహారం లభించలేదు. ఆశ్చర్యకరంగా దోహాలోని భారత రాయబార కార్యాలయానికి మరణాల గురించి సమాచారం లేదని చెప్పారు. తెలంగాణ నుండి వెళ్లిన ఈ వలస కార్మికులకు ఎవరు న్యాయం చేస్తారు" అని ఆయన అడిగారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీకి, విదేశాంగ మంత్రికి విజ్ఞప్తి చేశారు. 2022 ఫిఫా ప్రపంచ కప్ నవంబర్ 20 నుండి డిసెంబర్ 18 వరకు ఖతార్‌లో జరగాల్సి ఉంది. ఆతిథ్య దేశం ప్రపంచకప్‌కు సన్నాహాల్లో పాల్గొన్న విదేశీ కార్మికుల పట్ల వ్యవహరించిన విధానం వల్ల విమర్శలను ఎదుర్కొంటొంది.


Next Story