తెలంగాణ సచివాలయ భవనం కూల్చివేత పనులు ప్రారంభం

By సుభాష్  Published on  7 July 2020 4:20 AM GMT
తెలంగాణ సచివాలయ భవనం కూల్చివేత పనులు ప్రారంభం

హైకోర్టు తీర్పుతో తెలంగాణ సచివాలయ కొత్త భవన నిర్మాణానికి లైన్‌ క్లీయర్‌ అయ్యింది. పాత భవనం కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ మంగళవారం తెల్లవారుజాము నుంచి భారీ యంత్రాలతో భవనం కూల్చివేత పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆ వైపు వాహనాలు వెళ్లకుండా నిషేధించారు. అయితే సచివాలయ భవనం కూల్చివేత పనులు ఎప్పుడు ప్రారంభం కావాల్సి ఉండేది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సవాలు చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు కావడంతో పనులు ఆలస్యమయ్యాయి.

సచివాలయ భవనం కూల్చివేతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఇటీవల ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్న సచివాలయం ఇప్పుడున్న అవసరాలకు సరిపోవడం లేదని ప్రభుత్వం తమ వానను కోర్టులో వినిపించింది. అందరి వాదనలు విన్న హైకోర్టు ఎట్టకేలకు కూల్చివేతకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. పాత భవనాన్ని కూల్చివేసి ఆ స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించేందుకు కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే పనులను ప్రారంభించింది. ప్రస్తుతం సచివాలయ సి-బ్లాక్‌ను కూల్చివేసే పనులను ప్రారంభించింది.

ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన సచివాలయ భవనం ఇక కనుమరుగుకానుంది. త్వరలోనే కొత్త సచివాలయ నిర్మాణం కోసం పునాది పడనుంది. ఇప్పటికే సచివాలయంలో ఉన్న అన్ని శాఖలను ఇతర భవనాల్లోకి మార్చిన విషయం తెలిసిందే.

Next Story