ఆ నిందితుల తరఫున మేం వాదించం.. మహబూబ్నగర్ బార్ అసోసియేషన్
By అంజి Published on 30 Nov 2019 11:24 AM GMTమహబూబ్నగర్: వెటర్నరీ డాక్టర్ను హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, ప్రజాసంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. నిందితులను ఉరి తీయాలంటూ కాలేజీ విద్యార్థినిలు, మహిళలు, ప్రజలు ర్యాలీ చేపట్టారు. వెటర్నరీ డాక్టర్ హత్య కేసులో నిందితుల తరపున వాదించ వద్దని మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. నిందితులకు ఎలాంటి సహాయం చేయవద్దని న్యాయవాదులకు మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంత రెడ్డి విజ్ఞప్తి చేశారు. న్యాయవాదుల నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిందితులు ఉన్న షాద్నగర్లో పోలీస్స్టేషన్ ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీస్స్టేషన్ ముందు ప్రజలు ధర్మాకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తెలుగు న్యూస్ ఛానల్స్ని కేబుల్ ఆరేటర్లు తాత్కాలికంగా నిలిపివేశారు. మూడు రోజుల క్రితం వెటర్నరీ డాక్టర్ని అత్యాచారం చేసి, ఆపై సజీవ దహనం చేసిన విషయం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. కాగా నిందితుల కోసం 10 బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 48 గంటల్లోనే నిందితులను పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. నిందితులకు త్వరలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపర్చనున్నారు.