చిన్నారులను చిదిమేస్తున్న కామ పిశాచులు
By అంజి Published on 17 Feb 2020 1:22 PM IST
హైదరాబాద్: అభంశుభం తెలియని చిన్నారులపై కామాంధుల ఆఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. చాకెట్లు, బిస్కెట్లు ఆశ చూపి, మాయమాటలు చెప్పి చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. చిన్నారులను కామా పిశాచులు చిదిమేస్తున్నాయి. చిన్నారుల ఆడిస్తున్నట్లు నటిస్తూ.. శరీర భాగాలను తాకుతూ మానవమృగాలు కామానందం పొందుతున్నాయి. చిన్నారులపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటనలో పెరుగుతున్నాయి.
గృహహింస, వర్నకట్న వేధింపుల తర్వాత పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలే అధికమని మహిళా సహాయ కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. కాగా ఆపదలో ఉన్న మహిళలకు సాయం కోసం 2017లో ప్రభుత్వం 181 నెంబర్ మహిళా హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 181 నెంబర్కు రోజు దాదాపుగా 800పైగా కాల్స్ వస్తున్నాయి. బాధితులకు సఖి కేంద్రాల్లో ప్రభుత్వం తాత్కాలిక వసతి కల్పిస్తోంది. కేసుల పరిశీలన ఆధారంగా మహిళ రక్షణ కోసం సంబంధిత విభాగాలను అప్రమత్తం చేస్తోంది. కాగా కేసులు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి.
2017 డిసెంబర్లో ప్రారంభమైన మహిళా హెల్ప్లైన్కు.. గడిచిన రెండేళ్లలో దాదాపు 6 లక్షల ఫోన్ కాల్స్ వచ్చాయి. మహిళలకు సాయం చేసేందుకు ఈ హెల్ప్లైన్ను ఏర్పాటు చేశారు. అయితే గడిచిన మూడు నెలల కాలంలో కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కేసులు ప్రస్తుతం 11,259కి చేరుకుంది. అంతకుముందు మూడు నెలల క్రితం కేసుల సంఖ్య 9,526గా ఉంది. గృహహింస కేసులు, వరకట్న వేధింపులు, అత్యాచార కేసులు మరింతగా పెరుగుతున్నాయి.
గృహహింస కేసులు ఎక్కువగా రంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్ జిల్లాలో నమోదు అవుతున్నాయి. వరకట్న వేధింపుల కేసులు ఎక్కువగా రంగారెడ్డి, నిజామాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి నమోదు అవుతుండగా.. మహబూబ్నగర్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో అత్యాచార కేసులు పెరుగుతున్నాయి. లైంగిక దాడులు, అపహరణ కేసులు కూడా రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ప్రేమ పేరిట మోసాల కేసులు నల్గొండ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి.