తెలంగాణ బీజేపీ అధ్యక్షడిగా బండి సంజయ్
By న్యూస్మీటర్ తెలుగు Published on 11 March 2020 11:43 AM GMTతెలంగాణ బీజేపీకి కొత్త బాస్ నియమితుడయ్యాడు. ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ పదవీకాలం త్వరలో ముగియటంతో... కొత్త అధ్యక్షుడిని జాతీయ నాయకత్వం ఎంపిక చేసింది. చాలా కాలంగా హైదరాబాద్కు చెందిన కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లే రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు.
దీంతో.. ఈ సారి హైదరాబాదేతరునికి పార్టీ పగ్గాలు అప్పగించింది అధిస్టానం. ఉత్తర తెలంగాణలో పార్టీ బలపేతానికి కృషి చేసిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ను అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంజయ్ పేరును ఎంపిక చేసినట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇదిలావుంటే.. రాష్ట్ర పార్టీ నేతలకంటే, ఎంపీలే కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటంలో ముందుండటంతో.. ధర్మపురి అర్వింద్, బండి సంజయ్లలో ఒకరికి అధ్యక్ష పదవి వస్తుందనే ఊహాగానాలు ఉన్నాయి. అనుకున్నట్లుగానే బండి సంజయ్ను అధ్యక్షుడి పదవి వరించింది.
అలాగే.. పార్టీలో యువతకు ప్రాధాన్యమివ్వాలని కేంద్ర నాయకత్వం ఆలోచించడం.. ఎదగడానికి అవకాశమున్న తెలంగాణలో, దూకుడుగా ఉండే లీడర్కే పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని ఆలోచించిన నేఫథ్యంలో.. బండి సంజయ్ను అధ్యక్ష పదవి వరించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.