రేపే టీడీపీ ఇసుక దీక్ష..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Nov 2019 1:12 PM GMT
రేపే టీడీపీ ఇసుక దీక్ష..!

అమరావతి: రాష్ట్రంలో ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు నిరసనగా రేపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిరసన దీక్ష చేపట్టనున్నారు. రేపు 12 గంటల పాటు విజయవాడలో చంద్రబాబు ఇసుక దీక్ష చేయనున్నారు. ఇసుక దీక్షకు మద్దతుగా అఖిల పక్ష పార్టీలు మద్దతు తెలపాలని టీడీపీ కోరిన విషయం తెలిసిందే. ఇసుక కొరతకు ఎవరు నిరసన తెలిపిన తమ మద్దతు ఉంటుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రభుత్వ తప్పులను గుర్తు చేస్తే.. వ్యక్తి గత విమర్శలకు దిగుతున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే రేపటి దీక్షను విజయవంతం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. భవన నిర్మాణ కార్మికుల్లో భరోసా పెంచేందుకే దీక్ష చేపడుతున్నామని తెలిపారు. ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని చంద్రబాబు కోరారు. భవన నిర్మాణ కార్మికుల నోటి దగ్గర కూడు లాక్కొని వైసీపీ నేతలు అవినీతి కోటలు నిర్మిస్తున్నారని నారా లోకేష్‌ ఆరోపించారు. వరదల వల్లనే ఇసుక దొరకడం లేదని చిలక పలుకులు పలుకుతున్న సీఎం జగన్‌ భవన నిర్మాణ కార్మికులకు క్షమాపణలు చెప్పాలని నారా లోకేష్‌ డిమాండ్‌ చేశారు.

మరో వైపు ఇసుక కొరతపై చంద్రబాబు దీక్ష చేయడం విడ్డూరంగా ఉందని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలతో చూపించాలని లేదంటే తాను చంద్రబాబు పక్కనే దీక్షకు దిగుతానని హెచ్చరించారు.

Next Story