మహారాష్ట్రలో 'బీజేపీ' తీరుపై మండిపడ్డ సురవరం..!
By Medi Samrat Published on 23 Nov 2019 10:30 AM GMTమహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాల ద్వారా బీజేపీకి ప్రజాస్వామ్యం అంటే ఎలాంటి విలువ లేదని మరోసారి రుజువైందని సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. మహారాష్ట్ర తాజా పరిణామాలపై సురవరం ఓ లేఖను విడుదల చేశారు. వివిధ కేసులలో దోషులుగా తేలిన వారిని, ఆర్దిక నేరాలలో విచారణ ఎదుర్కొంటున్న వారిని ఇబ్బందులకు గురిచేయడం ద్వారానే తాము బలపడగలమని బీజేపీ బలంగా నమ్ముతుందని బీజేపీ తీరును దుయ్యబట్టారు. ఇందుకోసం ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఐటీ విభాగాల ద్వారా వారిని భయపెట్టేందుకు ప్రయత్నిస్తోందని.. ఈ విభాగాలు అవినీతి పరులను తమ అధీనంలోకి తీసుకుంటారని అన్నారు.
మహారాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా అర్ధరాత్రి తిరుగుబాటు ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. దీనిని బట్టే బీజేపీ రాజకీయ నేతలకు ఏం చెప్పదలచుకుందో స్పష్టంగా అర్ధమవుతుందని సురవరం అన్నారు. బీజేపీలో ఉన్న వాళ్ళు మినహా మిగతా వాళ్ళెవ్వరూ అవినీతికి పాల్పడకూడదని.. ఒక వేళ అవినీతికి పాల్పడి ఉంటే బీజేపీలో చేరండి. అవినీతికి పాల్పడండి.. సురక్షితంగా ఉండండి అనే సంకేతాలు మిగతా పార్టీల నేతలకు పంపుతుందని బీజేపీ తీరును ఎండగట్టారు.