అగ్రిగోల్డ్ తరహాలోనే మమ్మల్ని ఆదుకోండి..!
By న్యూస్మీటర్ తెలుగు Published on 18 Nov 2019 2:53 PM ISTఅమరావతి: అగ్రిగోల్డ్ తరహాలో తమనూ ఆదుకోవాలని అభయ గోల్డ్ బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో అభయ గోల్డ్ బాధితులు వినతి పత్రం సమర్పించారు. అభయ గోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం జగన్కు తమ బాధలను విన్నవించుకున్నారు. అభయ గోల్డ్ సంస్థలో 4.10 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు. 10 వేల ఏజెంట్ల నుంచి రూ.174 కోట్లు వసూలు చేసి మోసం చేసిందని బాధితులు ఆరోపించారు.
అధికారంలోకి వచ్చాక అభయ గోల్డ్ బాధితులకూ న్యాయం చేస్తామని పాదయాత్రలో సీఎం జగన్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసి అభయ గోల్డ్ బాధితులను పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. మోస పోయిన బాధితులు, ఏజెంట్లకు న్యాయం జరగకపోవడంతో కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని బాధితులు తెలిపారు. అభయ గోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు తక్షణ సాయం కింద ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేయాలని అగ్రిగోల్డ్ బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.