మంచి మనసున్న తిరుపతన్న.. ప్రజల మనిషిగా అసెంబ్లీకి వెళ్ళాలన్నా..

Nagam Tirupathi Reddy Success Story. ఎన్టీఆర్.. ఈ మూడు అక్షరాల పేరు వింటే చాలు తెలుగు ప్రజల ఛాతి గర్వంతో ఉప్పొంగుతుంది.

By Medi Samrat  Published on  28 April 2021 4:25 PM GMT
మంచి మనసున్న తిరుపతన్న.. ప్రజల మనిషిగా అసెంబ్లీకి వెళ్ళాలన్నా..

ఎన్టీఆర్.. ఈ మూడు అక్షరాల పేరు వింటే చాలు తెలుగు ప్రజల ఛాతి గర్వంతో ఉప్పొంగుతుంది. అందుకు కారణం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు.. ఆయన తెలుగు ప్రజల శక్తిని ప్రపంచానికి చాటిన మహనీయుడు. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాలో కూడా ఓ ఎన్టీఆర్ ఉన్నారు. ఆయనే నాగం తిరుపతి రెడ్డి. ఆయన పేరు చెబితే చాలు ఆ జిల్లా అంతా మావాడే అని అంటారు. ఎందుకంటే ఆయనను తమలో ఒక్కడు అని అక్కడి వారంతా అనుకుంటారు కాబట్టి..! నాగపూర్ గ్రామంలో అతి సామాన్య కుటుంబంలో ఆయన పుట్టారు. ఆ ఊరు.. ఆ జిల్లా గర్వించే స్థాయికి ఆయన ఎదిగారు. స్వశక్తితో ఏదైనా చేయొచ్చు అని అనుకుంటే ఎన్ని కష్టాలనైనా ఎదురొడ్డి నిలబడగలం అని నిరూపించారు. ఎంతో మందికి నేనున్నాను అంటూ ఆపన్నహస్తం అందించారు.. అందిస్తున్నారు..!


నాగం కృష్ణా రెడ్డి, సుభద్రమ్మ దంపతులకు 1974, డిసెంబర్ 25న 5వ సంతానంగా జన్మించారు. సాధారణ జీవితం.. ఇలానే ఉండిపోవాలా..? జీవితంలో ఎదగాలి.. ఏదో సాధించాలి..? మనం గొప్పగా బ్రతకడమే కాదు.. మనతో ఉన్న వాళ్ళను కూడా గొప్పగా బ్రతికేలా చేయాలి అనే సంకల్పంతో 1994లో హైదరాబాద్ లో అడుగుపెట్టారు. ఆయనది పది మందికి అన్నం పెట్టే చెయ్యే కానీ.. ఒకరి దగ్గర ఉండాలని అనుకునే వారే కాదు. హైదరాబాద్ లో అడుగు పెట్టడానికి ముందే ఆయన ఫిక్స్ అయ్యింది ఒక్కటే.. ఏది చేసినా తనకంటూ ఓ గుర్తింపు రావాలి. తానే పది మందికి వెలుగునివ్వాలి అని..! ప్రతి ఒక్క కుంటుంబం తమకు ఒక ఇల్లు ఉంటే చాలు అని అనుకుంటూ ఉంటుంది. రియలెస్టేట్ లోకి దిగితే ఎంతో మంది సొంతింటి కలను నిజం చేయొచ్చు అని అనుకున్నారు. ఆ ఒక్కటే కాదు ఎంతో మందికి ఉపాధి కల్పించొచ్చు అన్నది ఆయన సంకల్పం.

ఇక ఆయన హైదరాబాద్ లో రియలెస్టేట్ రంగంలోకి అడుగు పెట్టినప్పుడు ఒకటా.. రెండా.. ఎన్నో సవాళ్లు..! ఎంతో మంది ఆయన్ను తొక్కేయాలి.. సొంత ఊరికి పంపించేయాలని అనుకున్నారు. కానీ ఆయన సంకల్ప బలం.. ఆత్మస్థైర్యం ముందు నిలబడలేకపోయాయి. కిందకు పడేశారు.. అడ్డుగా నిలిచారు.. ఎక్కడ ఎదిగిపోతాడో అని కిందకు లాగడానికి కూడా ప్రయత్నించారు. కానీ ఆయన మాత్రం లేచారు.. అడ్డుగా ఉన్న వారే తనకు సలాం కొట్టేలా చేయించుకున్నారు.. ఎంతో ఎదగడమే కాకుండా.. ఎదిగాక మరెంతో మందికి తోడ్పాటును అందిస్తూ ఉన్నారు.


నాగం తిరుపతి రెడ్డి తాను అనుకున్న ఫీల్డ్ లో ఎదగడానికి ఎంతో సమయం తీసుకోలేదు. రియలెస్టేట్ ఎలా ఉంది.. ఎలా చేస్తే అందరూ లాభపడతారు అన్నదే ఆలోచించారు. అలా 1997లో 'ఐశ్వర్య ఎస్టేట్స్' ను స్థాపించారు. అక్కడే నాగం తిరుపతి రెడ్డి అడుగు రియలెస్టేట్ రంగంపై పడింది. ఇక ఈ రంగంలో ఎదగాలంటే ప్రజల్లో నమ్మకం ఉండాలి.. వినియోగదారులు కోరుకున్నది వారికి అందించాలి.. ఈ విషయాలను మాత్రమే ఆయన ఆలోచించారు. అదే విధంగా ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించారు.

పేదలైనా.. ధనికులైనా.. సొంతింటి గురించి ఎన్నో కలలు కంటూ ఉంటారు. అలాంటి వారి కోసమే 2014లో 'విజన్ ఇండియా ఇన్ఫ్రా స్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్' ను స్థాపించారు నాగం తిరుపతి రెడ్డి. సొంతింటి కలలను సాకారం చేసే ఉద్దేశ్యంతో ఈ సంస్థ ద్వారా ఎంతో మంది వినియోగదారులకు సంతృప్తిని అందించారు. 'రేపటి ప్రపంచాన్ని ఈరోజే నిర్మిద్దాం' అన్నది ఈ సంస్థ సిద్ధాంతం. అందులో భాగంగానే పేద, మధ్య తరగతి వారి కోసమే ఆయన పలు వెంచర్లను తీసుకుని వచ్చారు. అలా తీసుకుని వచ్చిన వెంచర్లలో తక్కువ ధరకే స్థలాలను సొంతం చేసుకుని.. సొంతింటి కలలను నెరవేర్చుకున్నాయి ఎన్నో కుటుంబాలు. ఆ కుటుంబాలన్నీ తాము ఎప్పటికీ నాగం తిరుపతి రెడ్డికి రుణ పడి ఉంటామని చెబుతూ ఉంటే ఆయన కళ్లల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ఇంతకంటే సంతృప్తి ఇంకేముంటుంది అని ఆయన తనతో ఉన్న వారితో చెబుతూ ఉంటారు. సిరి వనం, విజన్ ప్యారడైజ్, విజన్ ప్యారడైజ్ గ్రాండ్, స్టేటస్ సింబల్ వంటి వెంచర్లతో ఎంతో మందికి సొంతింటిని అందించారు. విజన్ ఇండియా చైర్మన్ గా ఆయన చేపట్టిన వెంచర్లు ఎంతో గుర్తింపును పొందాయి.


ఇక ఆయన చేసే సేవ కూడా గొప్పది. కులం-మతం అంటూ కొట్టుకుంటున్న వారికి మతసామరస్యం ఏమిటో తెలియజెప్పే నాయకుడై నిలిచారు నాగం తిరుపతి రెడ్డి. ఎంతో మందికి ఆకలి తీరుస్తున్న గొప్ప మనసున్న వ్యక్తి..! ఇక పేదల పెళ్ళిళ్ళకు అంతా తానై చూసుకుంటూ ఉంటారు. ఎంతో మంది కష్టాలను చూసి చలించిపోయి.. తనదైన తోడ్పాటును అందించే వ్యక్తిగా సమాజంలో పేరు తెచ్చుకున్నారు. ఎంతో మంది విద్యార్థులకు ఫీజు కట్టడం వంటివి చేశారు.. చేస్తున్నారు. ఇక ఆయన చేసే గుప్త దానాలకు లెక్కే లేదని ఆయన దగ్గర పని చేసే వారు, సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఆయన స్థాపించిన నాగం తిరుపతి రెడ్డి ఫౌండేషన్ ద్వారా లెక్కలేనన్ని సేవా కార్యక్రమాలు, దానాలు కూడా చేస్తూ వస్తున్నారు. ఆలయ నిర్మాణమైతే ఏమి.. దర్గాలకు సహాయం చేయడమైతేనేమి.. ఆయన దగ్గరకు సాయం అంటూ వెళితే చాలు ఒట్టి చేతులతో వెనక్కు పంపరని కూడా చెబుతారు. అలాంటి మంచి మనస్థత్వం ఉన్న గొప్ప మహనీయుడు అని నాగం తిరుపతి రెడ్డిని పొగిడేవారు తెలుగు రాష్ట్రాలలోనూ ఎంతో మంది ఉన్నారు. తన తండ్రి పేరు మీద ఎడ్ల పందేలను కూడా నిర్వహించి.. విజేతలకు భారీగా నగదు బహుమతులను ఇచ్చేవారు. 12000 మందికి పైగా ఆయన ఇప్పటి దాకా ఆర్ధిక సాయం చేశారు. ఒకప్పుడు సంపాదించిన మొత్తంలో 10 శాతం సహాయం చేస్తే చాలు అని అనుకునేవాడినని.. ఇప్పుడు తాను సంపాదిస్తున్న దానిలో 40-50 శాతం వరకూ ఇతరులకే సహాయం చేస్తున్నానని నాగం తిరుపతి రెడ్డి చెప్పుకొచ్చారు.


తాను సాధిస్తున్న విజయాలకు తన కుటుంబమే కారణం అని నాగం తిరుపతి రెడ్డి చెబుతూ ఉంటారు. తన సతీమణి నాగం వనజ కుటుంబం బాధ్యతలు తీసుకోవడంతో తాను రియలెస్టేట్ రంగంలో ఎదగడానికి ముఖ్య కారణం అని ఆయన చెబుతూ ఉంటారు. 2003లో వనజ గారిని పెళ్లి చేసుకున్నారు. అప్పటికి ఆయన భార్య 10 వరకూ మాత్రమే చదువుకున్నారు. తన భార్య ఉన్నత విద్య చదవాలని కోరుకున్న ఆయన భార్యను కాలేజీకి పంపించారు. ఇంటర్ పూర్తీ చేసిన వనజ గారు పిల్లల కారణంగా డిగ్రీని పోస్ట్ పోన్ చేశానని.. తన భర్త మాత్రం డిగ్రీని పూర్తీ చేయాలని కోరుతుండేనే వారని చెప్పుకొచ్చారు. బాధ్యతల కారణంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తీ చేశారు వనజ. ఆ తర్వాత మంచి కాలేజీలో ఎంబీఏ పూర్తీ చేశారు. ఆ తర్వాత ఎల్.ఎల్.బి. కూడా పూర్తీ చేశారు. తన ఎదుగుదలకు భర్తే కారణం అని నాగం వనజ చెప్పుకొచ్చారు. తన కుమార్తెలు ఐశ్వర్య, అక్షయలు అంటే తనకు పంచప్రాణాలని చెబుతుంటారు. పెద్ద కుమార్తె నాగం ఐశ్వర్య కూచిపూడి నాట్యంలో ఇప్పటికే తన ప్రతిభను చాటుకుంటోంది. డాక్టర్ పద్మజా రెడ్డి గారి దగ్గర కూచిపూడి నేర్చుకుంటూ ఉంది. 2015, జులై 4న కుమారుడు నాగం జశ్విన్ రెడ్డి రాకతో వారి కుటుంబంలో ఆనందం రెట్టింపైంది.

ఓ రైతు బిడ్డగా హైదరాబాద్ లోకి వచ్చిన నాగం తిరుపతి రెడ్డి కరాటే కోచింగ్ కూడా ఇచ్చేవారు. అలా కోచింగ్ ద్వారా వచ్చిన డబ్బునే రియలెస్టేట్ లో పెట్టుబడిగా పెట్టానని చెబుతూ ఉంటారు. బిల్డర్ అనే పదం తనను ఆకట్టుకోవడంతోనే రియలెస్టేట్ లోకి అడుగుపెట్టడం జరిగిందని నాగం తిరుపతి రెడ్డి గతంలోనే చెప్పుకొచ్చారు. ఇక దైవానుగ్రహం ఉంటే అనుకున్నది సాధించవచ్చని నమ్మే నాగం తిరుపతి రెడ్డి 2017లో బాలా పూర్ లడ్డును సొంతం చేసుకున్నారు. జీతం ఇచ్చే వారికి ఎన్నో టెన్షన్స్ ఉంటాయని.. అది మీకు కనిపించదని చిరునవ్వుతో చెబుతూ ఉంటారు. ఎవరో గుర్తిస్తారనే ఉద్దేశ్యంతో తానెప్పుడూ ఈ సేవా కార్యక్రమాలు చేయలేదని నాగం తిరుపతి రెడ్డి చెబుతారు. ఆయన సేవా గుణం చూసి డాక్టరేట్ కూడా వచ్చింది. 150 రూపాయలతో హైదరాబాద్ కు వచ్చిన నాగం తిరుపతి రెడ్డి ఈరోజు సక్సెస్ అయ్యారు అంటే.. అందుకు క్రమ శిక్షణ, సమయపాలన అని చెబుతూ ఉంటారు. ఈ సక్సెస్ మంత్రను పాటిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరూ విజయాన్ని అందుకోగలరని ఆయన చెబుతున్నారు.


తాను హైదరాబాద్ కు వచ్చిన కొత్తలోనే సినిమా తీయాలి అనే ఆలోచన కలిగిందని.. ఆ దిశగా అడుగులు పడ్డానికి చాలా సంవత్సరాల ప్రయాణం ఉందని అన్నారు. 2006 లో ఒక సినిమా తీశానని.. ప్రస్తుతం మూడు ప్రతిష్టాత్మక సినిమాలను తీస్తూ ఉన్నట్లు చెప్పుకొచ్చారు. నిర్మాతగానే కాకుండా.. నటుడిగా కూడా ఆయన కనిపించబోతున్నారు.

ఇక రాజకీయంగా తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. ఆయన కుటుంబంతో ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఇది తాను ఆశించనిదని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి మరణించినప్పుడు తనకు ఎంతో బాధగా అనిపించిందని.. తనకు కూడా చనిపోవాలని అనిపించిందని అన్నారు. వైఎస్ఆర్ బ్రతికున్నపుడు తనను ఎంతో ఆప్యాయంగా పలుకరించే వారని కూడా గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే కూడా ఎంతో అభిమానమని అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో తనకు ఎమ్మెల్యే పదవి ఒక్కటే దక్కడానికి సమయం పడుతోందని.. అది కూడా తప్పకుండా త్వరలోనే జరుగుతుందని అన్నారు నాగం తిరుపతి రెడ్డి. తన తండ్రి కమ్యూనిస్టు నాయకుడు కావడంతో అలాంటి భావజాలంతోనే ముందుకు వెళ్లారు. 'తిరుపతన్న' అంటే మంచి వ్యక్తి.. మంచి నాయకుడు అని ఆయన జిల్లా వాసులు నమ్ముతూ ఉంటారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం బలంగా ఉన్న నాగం తిరుపతి రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సేవ చేయడమన్నదే తన లక్ష్యమని.. ప్రజా నాయకుడిగా మరికొందరికి సాయం చేసేలా అసెంబ్లీ లోకి అడుగు పెట్టాలని ఆయన భావిస్తూ ఉన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో తప్పకుండా సీటు వస్తుందని భావిస్తూ ఉన్నారు. మంచి పనులు చేస్తూ వెళుతున్న తనని తప్పకుండా ప్రజలు ఆదరిస్తారనే ఆయన కూడా నమ్ముతూ ఉన్నారు.


Next Story