బాబుకు మహిళా కమిషన్ చైర్పర్సన్ స్ట్రాంగ్ కౌంటర్
By సుభాష్ Published on 12 Jan 2020 9:47 PM IST
-ఆడవారితో రాజకీయం వద్దు
ఏపీలో రాజకీయాల్లో మహిళలను లాగొద్దని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ చురకలంటించారు. కాగా, అమరావతి ఉద్యమంలో ముందు నుంచి టీమ్గా ఏర్పాటు చేసిన నారా చంద్రబాబు.. మహిళలను ముందుంచి తన వ్యూహాలు రచిస్తున్నారని ఆరోపణలున్నాయి. అమరావతి రాజధానిపై మహిళలను ముందుకు నడిపిస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా మహిళలను ముందుంచి ఆందోళనలు ఉధృతం చేస్తుంటే పోలీసులు ఏమైనా అంటే మహిళలపై దాడి అంటూ పెద్ద రచ్చ చేయాలన్నది చంద్రబాబు నాయుడు ప్లాన్ అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమరావతిలో మహిళలను ఇబ్బందుకులకు గురి చేస్తున్నారని, మహిళలను పోలీసులు బంధిస్తున్నారంటూ చంద్రబాబు ట్విట్టర్లో ధ్వజమెత్తారు.
ఇక చంద్రబాబు చేసిన ట్విట్కు జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ స్పందించారు. మహిళలను ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి లాగవద్దని హితవు పలికారు. మహిళా కమిషన్ బృందం ఇప్పటికే అక్కడే ఉందని, అన్ని విషయాలు గమనిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. రాజధాని రాజకీయంలో మహిళలను ఇరికించవద్దని తెలిపింది. మహిళలను ముందుంచి రాజకీయం చేయడ తగదని సూచించింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర గ్రామాల్లో జాతీయ మహిళా కమిషన్ సభ్యులు పర్యటించారు. రాజధాని గ్రామాల్లో ఆందోళనలు చేస్తున్న మహిళల నుంచి సమాచారం సేకరించారు. పోలీసుల దాడికి సంబంధించి అంశాలపై మహిళా కమిషన్ కో ఆర్డినేటర్ కాంచన కట్టర్, కౌన్సిలర్ ప్రవీణ్ సింగ్లు ఆరా తీశారు. రాజధానిలో మహిళలపై జరుగుతున్న దాడులను టీడీపీ నేతలు కమిషన్ సభ్యులకు వివరించారు. అలాగే తుళ్లూరు తహసీల్దార్, డీఎస్పీని కలిసి కమిషన్ సభ్యులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ కమిషన్ సభ్యులు దగ్గరికి రాజధాని గ్రామాల మహిళలు భారీగా తరలివచ్చారు.