రక్షణ కల్పించండి.. కేంద్రానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖ
By తోట వంశీ కుమార్
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్.. తనకు రక్షణ కల్పించాలంటూ కేంద్రప్రభుత్వానికి లేఖ రాశారు. కటుంబ సభ్యులతో పాటు తనపైనా దాడి జరిగే అవకాశం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. తనకు, తన కుటుంబానికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తాను హైదరాబాద్లో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.
కొందరు ఐఏఎస్, ఐపీఎస్ లు విధులు నిర్వహించలేకపోయారన్నారు. తన భద్రతతో పాటు ఎన్నికల నిర్వహణకు కూడా కేంద్ర బలగాలు అవసరమని ఐదు పేజీల లేఖ రాశారు. మంత్రులకు సీఎం టార్గెట్ పెట్టడాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఏపీలో జరిగిన ఏకగ్రీవాలపై కూడా ఆయన ప్రస్తావించారు. విభజన ఏపీలో ఇప్పుడు 24 శాతం ఎంపీటీసీలు ఏకగ్రీవాలు జరిగాయని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒకే జడ్పీటీసీ ఏకగ్రీవం అయిందని చెప్పారు. ఇప్పుడు 126 జడ్పీటీసీలు ఏకగ్రీవం కావడాన్ని రమేశ్ కుమార్ లేఖలో పేర్కొన్నారు. కడప జిల్లాలో 79 శాతం ఎంపీటీసీలు, 76 శాతం జడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యాయిని అన్నారు.