చనిపోవాలనుకున్నా.. కానీ వారే నన్ను ఆ చీకట్లోంచి బయటికి లాగారు..!
భారత క్రికెట్ జట్టు స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఇప్పుడు తన వ్యక్తిగత జీవితం గురించి పెద్ద విషయం వెల్లడించాడు.
By Medi Samrat
భారత క్రికెట్ జట్టు స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఇప్పుడు తన వ్యక్తిగత జీవితం గురించి పెద్ద విషయం వెల్లడించాడు. తన మాజీ భార్య, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ధనశ్రీ వర్మ నుండి విడాకుల గురించి.. తన మానసిక స్థితిని గురించి చాహల్ మొదటిసారిగా బహిరంగంగా వ్యక్తం చేశాడు. అది తనను తాను కోల్పోయిన కాలం అని, తన ప్రాణం తీసుకోవాలనే ఆలోచనలు తనను నిరంతరం ఇబ్బంది పెట్టాయని చెప్పాడు.
చాహల్, ధనశ్రీ డిసెంబర్ 2020 లో వివాహం చేసుకున్నారు. మార్చి 2025 లో విడాకులు తీసుకున్నారు. చాలా కాలం పాటు ప్రతికూల వార్తలకు దూరంగా ఉన్నప్పటికీ, వివాహం పతనానికి చేరువలో ఉన్నప్పుడు కూడా ఇద్దరూ సోషల్ మీడియాలో సాధారణ జంటలా కనిపించడం కొనసాగించారు.
రాజ్ షమణితో పోడ్కాస్ట్లో చాహల్ ఈ కాలం గురించి మాట్లాడాడు. తాను, ధనశ్రీ ఇద్దరూ తమ తమ కెరీర్తో ఇబ్బంది పడుతున్నామని చెప్పాడు. ఇద్దరు ప్రతిష్టాత్మక వ్యక్తులు కలిసి జీవించగలరని నేను నమ్ముతాను.. అయితే దీనికి అవగాహన అవసరం, ఇది కాలక్రమేణా తగ్గిపోయిందన్నాడు.
తాను, ధనశ్రీ ఉద్దేశపూర్వకంగా తమ సంబంధానికి సంబంధించిన సమస్యలను ప్రజలకు తెలియకుండా దాచామని చెప్పాడు. తన వ్యక్తిగత జీవితం బహిరంగ చర్చకు గురికావడం ఇష్టం లేదు. తుది నిర్ణయం తీసుకునే వరకు మేము సాధారణ జంటగా కనిపించాలని నిర్ణయించుకున్నాం. నేను ప్రతిక్షణం నవ్వుతూ కనబడ్డాను.. కానీ మనసు విరిగిపోయిందని పేర్కొన్నాడు. దాదాపు 40 రోజుల పాటు తాను కేవలం 2 గంటలు మాత్రమే నిద్రించగలిగానని, మిగిలిన సమయంలో మానసిక క్షోభకు గురయ్యానని చెప్పాడు. 'ఇవన్నీ ముగిస్తే బాగుంటుందని చాలాసార్లు అనిపించింది. నన్ను నేను చంపుకోవాలనే ఆలోచన ప్రారంభించాను. కానీ నా స్నేహితులు నన్ను ఆ చీకట్లోంచి బయటికి లాగారని చీకటి అధ్యాయం గురించి వివరించాడు.
విడాకుల ప్రక్రియలో చాహల్పై చాలా ఆరోపణలు వచ్చాయి.. ముఖ్యంగా దీనిపై చాహల్ మాట్లాడుతూ.. 'ప్రజలు నన్ను మోసగాడు అని పిలిచారు, అయితే నేను ఎవరి హృదయాన్ని విచ్ఛిన్నం చేయలేదు. నాకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.. నేను ఎల్లప్పుడూ మహిళలను గౌరవిస్తాను.. నా పేరు ఒక మహిళతో ముడిపడి ఉన్నందున.. నేను దోషినని కాదు అని పేర్కొన్నాడు.
యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ ఒక వర్చువల్ డ్యాన్స్ క్లాస్ ద్వారా కలుసుకున్నారు, అక్కడ ధనశ్రీ చాహల్కి డ్యాన్స్ నేర్పించడం ప్రారంభించింది. క్రమక్రమంగా ఇద్దరి మధ్య స్నేహం బలపడి ఆ తర్వాత ప్రేమగా మారింది. వారిద్దరూ డిసెంబర్ 2020 లో వివాహం చేసుకున్నారు, కానీ కాలం గడిచేకొద్దీ వారి మధ్య దూరం పెరగడం ప్రారంభమైంది. ఈ జంట మార్చి 2025లో విడాకులు తీసుకున్నారు.