మ్యాచ్‌లో మూడోసారి నల్ల బ్యాండ్లు ధరించిన ఇరు జ‌ట్ల ఆట‌గాళ్లు.. కారణం ఏమిటంటే..?

హెడింగ్లీ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌కి ఇది చివరి రోజు కాగా.. ఈ రోజు ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించి మైదానంలోకి వచ్చారు.

By Medi Samrat
Published on : 24 Jun 2025 5:18 PM IST

మ్యాచ్‌లో మూడోసారి నల్ల బ్యాండ్లు ధరించిన ఇరు జ‌ట్ల ఆట‌గాళ్లు.. కారణం ఏమిటంటే..?

హెడింగ్లీ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌కి ఇది చివరి రోజు కాగా.. ఈ రోజు ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించి మైదానంలోకి వచ్చారు. ఈ మ్యాచ్‌లో ఆటగాళ్లు చేతులకు నల్ల బ్యాండ్‌లు ధరించడం ఇది మూడోసారి. మ్యాచ్‌లో మొదటి రోజు, మూడో రోజు కూడా ఇదే జరిగింది. మ్యాచ్ చివరి రోజైన మంగళవారం ఇరు జట్లు మ్యాచ్ ప్రారంభానికి ముందు మైదానానికి వచ్చి మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్లు చేతులకు నల్ల బ్యాండ్‌లు కట్టుకుని కనిపించారు. దీనికి కారణం భారత మాజీ క్రికెటర్ దిలీప్ దోషి మృతి. చాలా కాలంగా లండన్ లో ఉంటున్న దిలీప్ సోమవారం రాత్రి మృతి చెందాడు. ఆయనకు నివాళులర్పించేందుకు ఈరోజు ఇరు జట్ల ఆటగాళ్లు చేతులకు నల్ల బ్యాండ్‌లు కట్టుకుని బయటకు వచ్చారు.

బీసీసీఐ తన X ఖాతాలో ఒక ఫోటోను విడుదల చేస్తూ.. "సోమవారం మరణించిన మాజీ భారత క్రికెటర్ దిలీప్ దోషి జ్ఞాపకార్థం రెండు జట్లు నల్ల బ్యాండ్‌లను ధరించాయని.. ఐదో రోజు ప్రారంభానికి ముందు ఇరు జట్లు ఒక నిమిషం మౌనం పాటించాయని పేర్కొంది.

అంతకుముందు మ్యాచ్‌లో తొలిరోజు కూడా ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాండ్‌లు ధరించారు. ఆ స‌మ‌యంలో అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులకు నివాళులర్పించారు. మూడో రోజు మ్యాచ్‌లో కూడా ఇరు జట్లు నల్ల బ్యాండ్‌లు ధరించాయి. దీనికి కారణం ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ డేవిడ్ లారెన్స్ మరణం. ఈ రోజు ఆట ప్రారంభానికి ముందు కూడా జట్లు ఈ బౌలర్‌ను స్మరించుకుంటూ మౌనం పాటించాయి.

Next Story