ఆఖ‌రి స‌మ‌రం.. సిరీస్‌పై కన్నేసిన ఇరు జట్లు

Who will win today’s match between India and South Africa.విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌, బుమ్రా, ష‌మి వంటి సీనియర్ల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Jun 2022 2:31 AM GMT
ఆఖ‌రి స‌మ‌రం.. సిరీస్‌పై కన్నేసిన ఇరు జట్లు

విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌, బుమ్రా, ష‌మి వంటి సీనియర్ల గైర్హాజరీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత.. తిరిగి గొప్ప‌గా పుంజుకుంది యువ భార‌త్‌. వ‌రుస‌గా రెండు మ్యాచుల్లో విజ‌యం సాధించి సిరీస్‌ను స‌మం చేసింది. అదే ఊపును కొన‌సాగిస్తూ నేడు(ఆదివారం) బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో జ‌రిగే ఆఖ‌రి మ్యాచ్‌లోనూ నెగ్గి.. ద‌క్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌ను గెల‌వాల‌ని బావిస్తోంది. అయితే.. వ‌రుస‌గా రెండు మ్యాచుల్లో భారీ తేడాతో గెలిచిన భార‌త్.. ఉదాసీన‌త‌కు తావ్వ‌కుండా స‌మిష్టిగా చెల‌రేగితే సిరీస్ గెల‌వ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు.

కొత్త ఆటగాళ్లు అప్పుడే తుది జట్టులో స్థానం ఆశించవద్దని సిరీస్‌కు ముందే హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా రెండు ఓటముల తర్వాత కూడా అనూహ్య మార్పులకు అవకాశం ఇవ్వకుండా అదే టీమ్‌ను కొనసాగించడం మంచి ఫలితాన్ని ఇచ్చింది. అటు బ్యాటింగ్‌లో ఇషాన్‌ కిషన్, రుతురాజ్, హార్దిక్‌ పాండ్యా ఆకట్టుకోగా.. ఇటు బౌలింగ్‌లో హర్షల్, అవేశ్, చహల్‌ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. అయితే.. కెప్టెన్ రిష‌బ్ పంత్, శ్రేయ‌స్ అయ్య‌ర్‌ల ఫామ్ టీమ్ఇండియాను క‌ల‌వ‌ర‌పెడుతోంది. వీరిద్ద‌రు నేటి మ్యాచులో చెల‌రేగాల‌ని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. దినేష్ కార్తీక్‌, హార్థిక్ పాండ్యాలు మ‌రోసారి త‌మ బ్యాట్లు ఝుళిపిస్తే భారీ స్కోరు ఖాయం. తొలి మ్యాచ్ మిన‌హా మిగిలిన మ్యాచుల్లో బౌల‌ర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆరంభంలో భువి పొదుపుగా బౌలింగ్ చేస్తూ ప్ర‌త్య‌ర్థి బ్యాట్స్‌మెన్లను ఆరంభంలో క‌ట్ట‌డి చేస్తున్నాడు. అక్ష‌ర్ ప‌టేల్ ఒక్క‌డే ఈ సిరీస్‌లో పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేదు.

తొలి రెండు మ్యాచుల్లో విజ‌యాలు సాధించిన త‌రువాత అనూహ్యంగా ద‌క్షిణాఫ్రికా చ‌తికిల ప‌డింది. గ‌త మ్యాచులో గాయ‌ప‌డి రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగిన కెప్టెన్ బ‌వుమా.. నేటి మ్యాచులో ఆడ‌టం పై స్ప‌ష్ట‌త లేదు. ఒక‌వేళ అత‌డు దూరం అయితే.. అత‌డి స్థానంలో రీజా హెండ్రిక్స్ బ‌రిలోకి దిగ‌నున్నాడు. డికాక్‌, క్లాస‌న్‌, డ‌సెన్‌, ప్రిటోరిస్‌,మిల్ల‌ర్ ల‌తో కూడిన స‌పారీల బ్యాటింగ్ విభాగం ప‌టిష్టంగా ఉంది. బౌలింగ్‌లో కేశవ్, షమ్సీ రూపంలో ఇద్ద‌రు నాణ్య‌మైన స్పిన్న‌ర్లున్న‌ప్ప‌టికీ భార‌త పిచ్‌ల‌పై వారు తేలిపోయారు. గ‌త మ్యాచులో ఆడ‌ని ర‌బాడ నేడు అందుబాటులోకి వ‌చ్చాడు. చిన్న‌స్వామి స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలం కాబ‌ట్టి మ‌రోసారి ప‌రుగుల వ‌ర‌ద ఖాయం.

Next Story