భారత్-వెస్టిండీస్‌ టీ20 సిరీస్‌.. క్రికెట్ అభిమానుల‌కు శుభ‌వార్త‌

WB Government Grants 75% Attendance At Eden Gardens For T20'S.మిగ‌తా దేశాల‌తో పోలిస్తే మ‌న దేశంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Feb 2022 5:44 AM GMT
భారత్-వెస్టిండీస్‌ టీ20 సిరీస్‌.. క్రికెట్ అభిమానుల‌కు శుభ‌వార్త‌

మిగ‌తా దేశాల‌తో పోలిస్తే మ‌న దేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజే వేరే. క‌రోనా మ‌హ‌మ్మారికి ముందు మ్యాచ్‌లు ఏవైనా( టెస్టులు, వ‌న్డేలు, టి 20) స్టేడియాలు అభిమానుల‌తో కిట‌కిట‌లాడేవి. క‌రోనా త‌రువాత స్టేడియాలు బోసిపోయి ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. అందుకు ప్ర‌ధాన కారణం. స్టేడియంలోకి అభిమానుల‌కు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డ‌మే. అయితే.. క్రికెట్ అభిమానుల‌కు ఇది నిజంగా శుభవార్తే. విండీస్‌తో భార‌త జ‌ట్టు కోల‌క‌తా వేదిక‌గా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడ‌నున్న సంగ‌తి తెలిసిదే.

టీ20 సిరీస్‌కు 75 శాతం ప్రేక్షకులకు అనుమ‌తి ఇస్తున్న‌ట్లు బెంగాల్ క్రికెట్ అసోసియేష‌న్ ప్ర‌క‌టించింది. సోమ‌వారం నుంచి ఆ రాష్ట్రంలో ఇండోర్‌, అవుట్‌డోర్ స్టేడియాల్లో జ‌రిగే క్రీడ‌ల‌కు 75 శాతం ప్రేక్ష‌కుల‌కు అనుమ‌తి ఇస్తూ ప‌శ్చిమ‌బెంగాల్ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో విండీస్‌తో మ్యాచ్‌కు ప్రేక్ష‌కుల‌కు అనుమ‌తి ఇవ్వ‌నున్నారు. ఈ నిర్ణ‌యంతో దాదాపు 50వేల మంది ప్రేక్ష‌కులు మ్యాచ్‌ను చూసేందుకు వీలు క‌లిగింది.

దీంతో చాలా రోజుల త‌రువాత స్వ‌దేశంలో అభిమానుల మ‌ధ్య టీమ్ఇండియా మ్యాచ్‌లు ఆడ‌నుంది. వెస్టిండీస్‌తో టీమ్ఇండియా మూడు వ‌న్డేలు, మూడు టీ20లు ఆడ‌నుంది. వ‌న్డేలు ఈ నెల 6 నుంచి అహ్మ‌దాబాద్ వేదిక‌గా ప్రారంభం కానుండ‌గా.. టీ20 సిరీస్ ఈ నెల 16 నుంచి మొద‌లుకానుంది. కాగా.. రోహిత్ సార‌ధ్యంలోని భార‌త జ‌ట్టు ఇప్ప‌టికే అహ్మ‌దాబాద్ చేరుకుంది. ప్ర‌స్తుతం టీమ్ క్వారంటైన్‌లో ఉంది. మూడు రోజుల క్వారంటైన్ అనంత‌రం టీమ్ఇండియా ప్రాక్టీస్ మొద‌లెట్ట‌నుంది.

Next Story