విశాఖ టెస్టు టీమిండియాదే

విశాఖ టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్‌పై 106 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది.

By Srikanth Gundamalla  Published on  5 Feb 2024 9:10 AM GMT
vizag, test match, team india, won, england ,

విశాఖ టెస్టు టీమిండియాదే 

విశాఖ టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్‌పై 106 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. రెండో టెస్టు మ్యాచ్‌లో మరో రోజు మిగిలి ఉండగానే మ్యాచ్‌ ముగిసింది. కాగా..ఐదు టెస్టు మ్యాచ్‌ల సరీస్‌ను తాజా గెలుపుతో టీమిండియా 1-1తో సమం చేసింది.

రెండో టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ టీమిండియా ఇంగ్లండ్‌పై ఆధిపత్యం కొనసాగించింది. తొలి ఇన్నింగ్స్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 396 పరుగులు చేసింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 253 పరుగులు మాత్రమే చేయగలిగింది. దాంతో.. అప్పటికే భారత్‌కు మంచి ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌, అక్షర్‌ పటేల్‌ మినహా ఎవరూ ఎక్కువ పరుగులు చేయలేకపోయారు. గిల్‌ దాదాపు 12 ఇన్నింగ్స్‌ల తర్వాత సెంచరీ సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 255 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. ఇక 399 పరుగుల భారీ లక్ష్యంతో ఇంగ్లండ్‌ బరిలోకి దిగింది. మూడో రోజు మధ్యాహ్నం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ తొలుత వేగంగా పరుగులు చేయసాగింది. ఇక తొలి వికెట్‌ మూడోరోజే పడటంతో కాస్త వెనక్కి తగ్గారు.

రెండో ఇన్నింగ్స్‌లో నెమ్మదిగానే ఇంగ్లండ్‌ ఆడినా కూడా చివరి వరకూ నిలబడలేక పోయారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు మేజిక్‌ చూపించారు. వరుసగా వికెట్లు పడగొట్టారు. దాంతో.. రెండో టెస్టులో గెలవాలంటే 399 పరగులు చేయాల్సిన ఇంగ్లండ్ 292 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. బుమ్రా, అశ్విన్‌ చెరో మూడు వికెట్లు తీయగా.. ముఖేశ్, కుల్దీప్, అక్షర్ పటేల్‌ తలో వికెట్ తీశారు. ఇక ఇంగ్లండ్‌ బ్యాటర్లలో క్రావ్లే (73), బెన్‌ ఫోక్స్ (36), టామ్‌ హార్ట్‌లే (36), బెన్‌ డకెట్ (28) పరుగులు చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ సరికొత్త రికార్డును అందుకున్నాడు. టెస్టుల్లో ఇంగ్లండ్‌పై భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా చరిత్రకెక్కాడు.

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ విశాఖ టెస్టులో టీమిండియా గెలుపుతో 1-1తో సమం అయ్యింది. ఇక మూడో టెస్టు మ్యాచ్‌ ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రారంభం అయి.. ఫిబ్రవరి 19వ తేదీ వరకు కొనసాగనుంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ స్టేడియంలో ఈ మూడో టెస్టు మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటి వరకు టెస్టు సిరీస్‌కు దూరంగా ఉన్న టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ మూడో టెస్టు నుంచి జట్టుకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Next Story