ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన‌ విరాట్ కోహ్లీ..!

Virat Kohli and Co. to begin WTC preparation early in England. జూన్ 7 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా ప్రాక్టీస్ ప్రారంభించింది.

By Medi Samrat  Published on  29 May 2023 2:08 PM GMT
ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన‌ విరాట్ కోహ్లీ..!

జూన్ 7 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా ప్రాక్టీస్ ప్రారంభించింది. ఐపీఎల్ 2023లో పాల్గొన్న విరాట్ కోహ్లీ.. త‌న టీం టోర్నీ నుంచి వైదొల‌గ‌డంతో ఇంగ్లండ్‌లో భారత జట్టుతో చేరాడు. కోహ్లీతో పాటు ఛతేశ్వర్ పుజారా, జయదేవ్ ఉనద్కత్ ఇంగ్లిష్ గడ్డపై అడుగుపెట్టారు. బీసీసీఐ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ముగ్గురు ఆటగాళ్ల ఫోటోల‌ను షేర్ చేస్తూ సమాచారమిచ్చింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైన‌ల్‌ మ్యాచ్ జూన్ 7 నుంచి ఓవల్‌లో జరగనుంది.

డ‌బ్ల్యూటీసీ ఫైనల్ కోసం భారత జట్టు ప్రాక్టీస్ ప్రారంభించింది. భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను కూడా బీసీసీఐ షేర్ చేసింది. ఒక ఫోటోలో ఉమేష్ యాదవ్, సిరాజ్, కోహ్లీలు ప‌రుగెడుతుండ‌గా.. మరొక చిత్రంలో పుజారా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ నుండి బ్యాటింగ్ నైపుణ్యాలను నేర్చుకోవ‌డం చూడ‌వ‌చ్చు. రవిచంద్రన్ అశ్విన్ కూడా బౌలింగ్ ప్రాక్టీస్ చేసే ఫోటోను షేర్ చేసింది బీసీసీఐ.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ తొలి సీజన్‌లో కూడా భారత జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే ఫైనల్లో కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్.. టెస్ట్‌ చాంపియన్ కావాలన్న భారత జట్టు కలను చిత్తు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా గత సారి చేసిన తప్పును పునరావృతం చేయకూడ‌ద‌ని భావిస్తోంది.


Next Story