పాక్‌కు కోలుకోలేని షాక్‌.. ఆ ఇద్ద‌రు ఆట‌గాళ్లు ప్ర‌పంచ‌కప్ వ‌ర‌కూ కోలుకోపోతే..

ఆసియా కప్ సూపర్ 4 తొలి మ్యాచ్‌లో భారత్ 288 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది.

By Medi Samrat  Published on  14 Sep 2023 10:49 AM GMT
పాక్‌కు కోలుకోలేని షాక్‌.. ఆ ఇద్ద‌రు ఆట‌గాళ్లు ప్ర‌పంచ‌కప్ వ‌ర‌కూ కోలుకోపోతే..

ఆసియా కప్ సూపర్ 4 తొలి మ్యాచ్‌లో భారత్ 288 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. వర్షం కారణంగా భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌డే ప్రకటించిన విష‌యం తెలిసిందే. రిజర్వ్ డే రోజున విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మూడో వికెట్‌కు 233 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 356 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు టాప్‌ బౌలర్లు గాయపడడం విశేషం. ఆ బౌలర్లు పాకిస్థాన్‌కు చాలా ముఖ్యమైన ఆటగాళ్లు.

రిజర్వ్ రోజున హారిస్ రవూఫ్ బౌలింగ్ చేయలేదు. మ్యాచ్ మధ్యలో నసీమ్ షా గాయపడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచకప్‌కు కొద్దిరోజులే ఉండ‌టంతో పాకిస్థాన్‌కు పెద్ద షాక్ తగిలే అవ‌కాశం ఉంద‌ని ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇద్దరు బౌలర్ల ఫిట్‌నెస్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పెద్ద అప్‌డేట్ ఇచ్చింది.

భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో నసీమ్ షా కుడి భుజానికి గాయం కావడంతో అతడు ఆసియా కప్‌కు దూరమయ్యాడు. నసీమ్ షా స్థానంలో ఫాస్ట్ బౌలర్ జమాన్ ఖాన్ జట్టులోకి రానున్నాడు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని నసీమ్ మెడికల్ ప్యానెల్ పర్యవేక్షణలో ఉన్నాడు.

హారిస్ రవూఫ్ తన నడుము నొప్పి కారణంగా భారత్‌తో జరిగిన రిజర్వ్ డేలో బౌలింగ్ చేయలేకపోయాడు. దీనిపై PCB.. హారిస్ బాగా కోలుకుంటున్నాడు. ప్రపంచకప్‌కు ముందు ఇద్దరు బౌలర్లు ఆరోగ్యంగా ఉండేందుకు వైద్యుల బృందం అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తుందని పేర్కొంది.

Next Story