హార్ట్‌బీట్ పెరిగిపోయింది.. బర్త్‌డే గిఫ్ట్‌కి థ్యాంక్స్‌: ఎంఎస్ ధోనీ

టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది.

By Srikanth Gundamalla  Published on  30 Jun 2024 3:45 AM GMT
t20 world cup, winner, india, ms dhoni,

హార్ట్‌బీట్ పెరిగిపోయింది.. బర్త్‌డే గిఫ్ట్‌కి థ్యాంక్స్‌: ఎంఎస్ ధోనీ

టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో గెలిచి కప్‌ను మరోసారి ముద్దాడింది. 17 ఏళ్ల తర్వాత రెండో కప్‌ను భారత్‌ సొంతం చేసుకుంది. రోహిత్ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్‌ దక్కించుకున్నందుకు క్రికెట్‌ అభిమానులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విజయం పట్ల రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు సహా ప్రముఖులంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. తొలిసారి భారత్‌కు టీ20 వరల్డ్‌ కప్‌ను అందించిన భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ కూడా స్పందించారు. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎంఎస్‌ ధోనీ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ కూల్‌గా ఉంటారు. అలాంటి ధోనీ.. టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ చూస్తూ హార్ట్‌ బీట్ పెరిగిందని చెప్పాడు. 'ఈ మ్యాచ్‌ సమయంలో నా హార్ట్‌ రేట్‌ పెరిగిపోయింది. నిశ్శబ్దంగా ఉంటూనే విజేతగా నిలిచారు. ప్రతి ఒక్కరి మీద నమ్మకం ఉంచి కుర్రాళ్ల నుంచి ఫలితం రాబట్టడం అద్భుతం. వరల్డ్‌ కప్‌ను స్వదేశానికి తీసుకొస్తున్నందుకు ప్రతి భారతీయుడు గర్వంగా ఫీలవుతాడు. కంగ్రాట్స్‌ బాయ్స్‌. విలువ కట్టలేని బహుమతిని పుట్టిన రోజుకు ఇచ్చినందుకు ధన్యవాదాలు' అంటూ ఎంఎస్‌ ధోనీ చెప్పుకొచ్చాడు. అయితే.. జూలై 7వ తేదీన ఎంఎస్‌ ధోనీ బర్త్‌డే. దానిని ప్రస్తావిస్తూ తనకు గిఫ్ట్‌ ఇస్తున్నారంటూ ధోనీ ఇలా పోస్టు పెట్టారంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు..

ఇక టీమిండియా విజయంపై క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా స్పందించారు. ప్రతి స్టార్ భారత్‌ విజయం సాధించడంలో కృషి చేశారని చెప్పారు. జెర్సీని చూసి దేవం గర్వపడేలా చేశారన్నారు. పిల్లలు కూడా తాము క్రికెటర్లు కావాలని కలలు కంటున్నారు. ఈ విజయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. బారత్ నాలుగో స్టార్‌ను సాధించిందని అన్నారు. రెండో టీ20 వరల్డ్ కప్‌ను సాధించడం అభినందనీయం అంటూ సచిన్ టెండూల్కర్ పేర్కొన్నారు. ఇప్పటికే వన్డే ప్రపంచ కప్‌ 1983, 2011, టీ20 ప్రపంచ కప్‌ 2007 విజేతగా భారత్‌ నిలిచిన సంగతి తెలిసిందే.

Next Story