టీమిండియా సెమీస్ జట్టులో మార్పు..! అతను రీఎంట్రీ?
టీ20 వరల్డ్ కప్లో సూపర్-8 దశ కూడా ముగిసింది.
By Srikanth Gundamalla Published on 26 Jun 2024 1:30 PM IST
టీమిండియా సెమీస్ జట్టులో మార్పు..! అతను రీఎంట్రీ?
టీ20 వరల్డ్ కప్లో సూపర్-8 దశ కూడా ముగిసింది. గ్రూప్ ఏ నుంచి భారత్, అప్ఘానిస్థాన్ జట్లు సెమీస్కు చేరాయి. ఇక గ్రూప్-బి నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీస్ మ్యాచ్లు ఆడేందుకు అర్హతను సాధించాయి. ఎన్నడూ లేని విధంగా అప్ఘాన్ ఈ సారి టోర్నీలో రాణించింది. మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్లను ఓడించి సెమీస్ వరకూ చేరింది. అయితే.. రెండు సెమీస్ మ్యాచ్లు ఆసక్తికగా మారాయి. ముఖ్యంగా బలాబలాల్లో భారత్, ఇంగ్లండ్ జట్లు సమఉజ్జిగా కనబడుతున్నాయి. దాంతో.. రెండో సెమీస్లో ఎవరు గెలుస్తారు? ఫైనల్ వెళ్లేదెవరు అనేదానిపై ఆసక్తి కొనసాగుతోంది.
కాగా.. గురువారమే రెండు సెమీస్ మ్యాచ్లు ఉన్నాయి. జూన్ 27న మొదటి సెమీస్ దక్షిణాఫ్రికా, అప్ఘానిస్థాన్ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ ఉదయం 6 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత రాత్రి 8 గంటల నుంచి రెండో సెమీస్ మ్యాచ్లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడబోతున్నాయి. ఒక్క విజయం సాధించి ఫైనల్ కు వెళ్లాలని నాలుగు జట్లు ఎంతో ఉత్సాహంగా కనబడుతున్నాయి. అయితే.. 2022 టీ20 వరల్డ్ కప్ను గమనిస్తే.. భారత్, ఇంగ్లండ్ మధ్య అప్పుడు సెమీస్ జరిగింది. ఆ మ్యాచ్లో భారత్ ఘోర పరాభవాన్నిచూసింది. ఒక్క వికెట్ కోల్పోకుండా భారత్ జట్టును ఇంగ్లండ్ చిత్తు చేసింది. ఇన్నింగ్స్లో కేవలం 16 ఓవర్లలోనే టార్గెట్ను చేదించింది. ఈ క్రమంలోనే టీమిండియా జట్టులో సెమీస్ కోసం స్వల్ప మార్పు జరగబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో ఇప్పటి వరకు రవీంద్ర జడేజా గొప్పగా రాణించలేదు. ఆల్రౌండర్గా ఉన్న అతను బౌలింగ్, బ్యాటింగ్లో పేలవ ప్రదర్శన ఇచ్చాడు. దాంతో.. జడేజా స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటర్ సంజూశాంస్ను జట్టులోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. టీమిండియా ఇంగ్లండ్తో సెమీస్ మ్యాచ్ గయానా పిచ్లో ఆడబోతుంది. ఈ పిచ్ బౌలింగ్, బ్యాటింగ్ రెండింటికీ అనుకూలంగా ఉంటుంది. దాంతో.. భారీస్కోర్ నమోదు చేయొచ్చనే ఉద్దేశంతో భారత్ ఉన్నట్లు తెలుస్తోంది. టీమిండియా కెప్టెన్ మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.