అభిమానుల‌కు శుభ‌వార్త‌.. రైనాకు ఆ దేశ ప్రతిష్టాత్మక అవార్డు

Suresh Raina Felicitated With Sports Icon Award By Maldives Government.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్(ఐపీఎల్‌)లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 March 2022 9:58 AM GMT
అభిమానుల‌కు శుభ‌వార్త‌.. రైనాకు ఆ దేశ ప్రతిష్టాత్మక అవార్డు

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్(ఐపీఎల్‌)లో అత్యంత విజ‌య‌వంత‌మైన బ్యాట‌ర్ల‌లో సురేశ్ రైనా ఒక‌రు. ఐపీఎల్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఎక్కువ‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు త‌రుపున ఆడాడు. అభిమానులు అత‌డిని ముద్దుగా చిన్న త‌లా అని పిలుచుకుంటారు. అయితే.. ఈ సారి జ‌రిగిన మెలా వేలంగా రైనాను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంచైజీ ముందుకు రాలేదు. దీంతో వేలంలో అమ్ముడిపోని ఆట‌గాడిని రైనా మిగిలిపోయాడు. ఐపీఎల్ లో ఆట‌గాడిగా రైనాను చూడ‌లేక‌పోయినా.. కామెంటేట‌ర్‌గా చూడొచ్చు. భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రితో కలిసి రైనా హిందీ కామెంట్రీ చెప్పనున్నాడు.

ఐపీఎల్ ఫ్రాంచైజీలు రైనా ను పట్టించుకోకపోయినా.. మాల్దీవ్స్‌ ప్రభుత్వం అతడికి ప్రతిష్టాత్మక అవార్డును అందజేసింది. ఆ దేశం ప్ర‌తి ఏటా ఇచ్చే 'స్పోర్ట్స్ ఐకాన్' అవార్డుకు రైనా ఎంపిక‌య్యాడు. మాల్దీవులులో జరిగిన కార్యక్రమంలో బంగ్లాదేశ్ క్రీడామంత్రి మహ్మద్ జహీర్ అహ్సన్ రసెల్ చేతుల మీదుగా స్పోర్ట్స్ ఐకాన్ అవార్డును రైనా అందుకున్నాడు. త‌న కెరీర్‌లో అత‌డు చేసిన సేవ‌ల‌కు గాను ఈ అవార్డు ఇచ్చిన‌ట్లు మాల్దీవ్స్‌ ప్రభుత్వం తెలిపింది.

ఈ కార్యక్ర‌మంలో సౌదీ అరేబియా క్రీడా శాఖ మంత్రి అల్ కది అబ్దుల్ రెహ్మాన్, మాల్దీవ్స్‌ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు అహ్మద్ నజీర్ త‌దిత‌రులు పాల్గొన్నారు. మొత్తం వివిధ దేశాల‌కు చెందిన 16 మంది క్రీడాకారులు ఈ అవార్డు అందుకున్నారు. వారిలో రియల్ మాడ్రిడ్ మాజీ ఆటగాడు రొబార్టో కార్లోస్, జమైకన్ స్ప్రింటర్ అసఫ పావెల్, శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య, డచ్ ఫుట్ బాల్ లెజెండ్ ఎడ్గర్ డేవిడ్స్ త‌దిత‌రులు ఉన్నారు.

రైనా కెరీర్ విష‌యానికి వ‌స్తే.. ఐపీఎల్ 205 మ్యాచ్‌లు ఆడిన రైనా 5,528 ప‌రుగులు చేశాడు. ఇందులో ఓ శ‌త‌కం, 33 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. ఇక టీమ్ఇండియా త‌రుపున వ‌న్డేల్లో 226 మ్యాచుల్లో 5,615, 78 టీ20ల్లో 1,605, 18 టెస్టుల్లో 768 ప‌రుగులు చేశాడు.

Next Story