కొత్త రూల్: ఇక టైమ్ వేస్ట్ అనేదే ఉండదు..!

ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ICC సమావేశంలో క్రికెట్ మ్యాచ్ లలో స్టాప్ క్లాక్‌లను తీసుకుని రావాలని ఆమోదం లభించింది.

By Medi Samrat  Published on  11 Dec 2023 12:41 PM GMT
కొత్త రూల్: ఇక టైమ్ వేస్ట్ అనేదే ఉండదు..!

ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ICC సమావేశంలో క్రికెట్ మ్యాచ్ లలో స్టాప్ క్లాక్‌లను తీసుకుని రావాలని ఆమోదం లభించింది. దీంతో 2023 డిసెంబర్ 12న బార్బడోస్‌లో వెస్టిండీస్, ఇంగ్లండ్‌ల మధ్య T20I మ్యాచ్ తో ఈ రూల్ ను ప్రారంభించబోతున్నారు. ట్రయల్ దశలో భాగంగా డిసెంబర్ 2023- ఏప్రిల్ 2024 మధ్య సుమారు 59 మ్యాచ్‌లలో రూల్ ను పరిశీలించబోతూన్నట్లు ICC ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆట వేగాన్ని పెంచడానికి కొనసాగుతున్న ప్రయత్నాలని ఐసీసీ తెలిపింది.

కొత్త రూల్ ప్రకారం ఓవర్ ముగిసిన తర్వాత 60 సెకన్ల లోపు కొత్త ఓవర్ ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ రూల్ అమలు చేసేందుకు ఓ ఎలక్ట్రానిక్ క్లాక్ ను స్టేడియంలో ఏర్పాటు చేస్తారు. ఇది 60 నుంచి 0 వరకు కౌంట్ డౌన్ చేస్తుంది. ఫీల్డింగ్ జట్లు నిర్ణీత సమయంలోపు కొత్త ఓవర్ లో తొలి బంతిని విసరలేకపోతే ఆ జట్టుకు రెండు హెచ్చరికలు జారీ చేస్తారు. హెచ్చరికలను దాటితే మాత్రం ఐదు పరుగుల జరిమానా విధించే వీలుంటుంది. అయితే, వికెట్ పడినప్పుడు మైదానంలోకి కొత్త బ్యాట్స్ మన్ వచ్చిన సమయంలో ఈ నిబంధన వర్తించదు. డ్రింక్స్ సమయంలోనూ, గాయపడిన ఆటగాడు మైదానంలో చికిత్స పొందేందుకు అంపైర్లు అనుమతించినప్పుడు, ఫీల్డింగ్ జట్టుకు సంబంధించని కారణాలతో సమయం వృథా అయినప్పుడు కూడా ఈ నిబంధన వర్తించదు. 41.9 నిబంధన కింద ఈ కొత్త రూల్ తెచ్చేందుకు ఐసీసీ కసరత్తులు చేస్తోంది. తొలుత దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. డిసెంబరు 12న వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే తొలి టీ20 ద్వారా ఈ నూతన నిబంధన తీసుకురానున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో మ్యాచ్ వేగాన్ని పెంచే మార్గాలను మేము నిరంతరం పరిశీలిస్తున్నామని ఐసిసి జనరల్ మేనేజర్ (క్రికెట్) వసీం ఖాన్ ఇటీవల అన్నారు.

Next Story