కంబళ వీరుడి కొత్త రికార్డు
Srinivas Gowda sets new record in Kambala racing. ఉసేన్ బోల్ట్గా గుర్తింపు పొందిన కంబళ వీరుడు శ్రీనివాస గౌడ వారంరోజుల్లోనే తన రికార్డును తానే అధిగమించి మరో సరికొత రికార్డును నెలకొల్పాడు.
By Medi Samrat Published on 30 March 2021 2:49 AM GMTరికార్డులు క్రియేట్ చేయడమే గ్రేట్ అయితే తమ రికార్డును తామే అధిగమించడం ఇంకా గ్రేట్. అలాంటిది వారం రోజుల వ్యవధిలో తన రికార్డ్ తానే అధిగమిస్తే అంటే అదొక అద్భుతం.. అంతే.. ఉసేన్ బోల్ట్గా గుర్తింపు పొందిన కంబళ వీరుడు శ్రీనివాస గౌడ వారంరోజుల్లోనే తన రికార్డును తానే అధిగమించి మరో సరికొత రికార్డును నెలకొల్పాడు. గతేడాది 100 మీటర్ల పరుగును 9.55 సెకన్లలో పూర్తి చేసి శ్రీనివాస గౌడ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అదే 100 మీటర్లను ఇప్పుడు 8.78 సెకన్లలోనే పూర్తిచేసి తన రికార్డును తిరగరాశాడు.
ఆదివారం కర్ణాటకలోని బంత్వాల్ తాలూకా పరిధి కక్యపడవ గ్రామంలో మైరాసత్య సంస్థ నిర్వహించిన 125 మీటర్ల పరుగును 11.21 సెకన్లలోనే పూర్తిచేయగా దాన్ని 100 మీటర్లకు లెక్కగట్టి 8.78 సెకన్లలోనే పూర్తిచేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే గతవారమే వెళ్తాంగండి పరిధిలో నిర్వహించిన కంబళ పోటీల్లో శ్రీనివాస గౌడ అదే రేసును 8.96 సెకన్లలో పూర్తిచేశాడు. దీంతో వారంరోజుల్లో తన రికార్డును తానే అధిగమించి.. ఉసేన్ బోల్ట్ పేరును సార్థకం చేసుకున్నాడు.
కంబాల అనేది దక్షిణ కన్నడ, ఉడుపి, తుళునాడు తీర ప్రాంతంలో ప్రతి ఏడాది నిర్వహించే ఒక సాంప్రదాయ క్రీడ. కంబాల ఆటలో ఎద్దుల పోటీదారుడు బురద నీటిలో పరుగెడ్తాడు. ఎవరైతే ఎద్దులను వేగంగా పరుగెత్తించి లక్ష్యాన్ని చేరుకుంటారో వారే విజేతగా నిలుస్తారు. కర్ణాటకలో వ్యవసాయం చేసే గౌడ సామాజిక వర్గం వారు ఈ పోటీల్లో పాల్గొంటారు. ఈ క్రీడా అత్యంత పురాతనం అయినది. శ్రీనివాస గౌడ్ వ్యక్తిగత విషయాలను పరిశీలిస్తే.. అతను కేవలం 5వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువును మధ్యలోనే ఆపేసి భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్నాడు. గత ఆరేళ్లుగా కంబళ పోటీల్లో పాల్గొంటున్నాడు. రెండేళ్లుగా రికార్డులు తిరగరాస్తూనే ఉన్నాడు.