అప్పుడు త‌ప్పించారు.. ఇప్పుడు అప్ప‌గించారు..!

మహ్మద్ రిజ్వాన్‌ను పాకిస్థాన్ వన్డే కెప్టెన్‌గా తొలగించి.. అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిదికి నాయకత్వ బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

By -  Medi Samrat
Published on : 21 Oct 2025 10:00 AM IST

అప్పుడు త‌ప్పించారు.. ఇప్పుడు అప్ప‌గించారు..!

మహ్మద్ రిజ్వాన్‌ను పాకిస్థాన్ వన్డే కెప్టెన్‌గా తొలగించి.. అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిదికి నాయకత్వ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెల్లడించింది. ఇస్లామాబాద్‌లో వైట్ బాల్ ఫార్మాట్ కోచ్ మైక్ హెస్సన్, హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ ఆకిబ్ జావేద్, జాతీయ సెలెక్టర్ కమిటీ సమావేశం జరిగింది.

నవంబర్ 4 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్ నుంచి పాకిస్థాన్ జట్టుకు షాహీన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. షహీన్ ఇంతకుముందు 2024 ప్రారంభంలో T20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు, కానీ కేవలం రెండు నెలల తర్వాత అతడిని ఈ బాధ్యత నుండి తొలగించారు.

అక్టోబర్ 2024లో రిజ్వాన్‌కు పాకిస్తాన్ ODI, T20 జట్టుకు కెప్టెన్సీ ఇవ్వబడింది. కానీ అతని నాయకత్వంలో జట్టు ఆశించిన ఫలితాలను పొందలేకపోయింది. రిజ్వాన్ నాయకత్వంలో పాకిస్థాన్ 20 వన్డేల్లో తొమ్మిది మ్యాచ్‌లు గెలిచింది, 11 ఓడిపోయింది. విజయాల‌ శాతం 45 శాతం. T20ల‌లో అతని కెప్టెన్సీలో జ‌ట్టు మ‌రింత విఫలమైంది. రిజ్వాన్ కెప్టెన్‌గా ఉన్న నాలుగు మ్యాచ్‌ల్లోనూ పాకిస్తాన్ ఓడిపోయింది.

టీ20లో వరుస పరాజయాల కారణంగా రిజ్వాన్ స్థానంలో సల్మాన్ అలీ అగాను టీ20 కెప్టెన్‌గా నియమించారు, కానీ ఇప్పటివరకు రిజ్వాన్ వన్డే జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. పాక్ జట్టులో రెగ్యులర్ నాయకత్వ మార్పు ఇంకా కొనసాగుతోందనడానికి మరోసారి కెప్టెన్‌ని మారుస్తూ పీసీబీ తీసుకున్న నిర్ణయమే నిదర్శనం.

ODI కెప్టెన్‌గా రిజ్వాన్‌ను తొలగించినట్లు ఎప్ప‌టినుంచో వార్త‌లు వెలువ‌డ్డాయి. అయితే సోమవారం జరిగిన ఈ సమావేశం తరువాత.. అతడి తొలగింపు అధికారికంగా ధృవీకరించబడింది.

Next Story