ఇంగ్లండ్-భారత్ ఐదు టెస్టుల సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. యువకుడు శుభ్మన్ గిల్ భారత టెస్టు జట్టు పగ్గాలు చేపట్టనుండగా.. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ను వైస్ కెప్టెన్గా నియమించారు. అయితే.. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025లో రిషబ్ పంత్ ఆటతీరు అంతగా బాలేదు.. పంత్ 14 మ్యాచ్ల్లో కేవలం 269 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాడ్ ఐపీఎల్ సీజన్ తర్వాత పంత్ ఇంగ్లండ్ చేరుకున్నాడు. ఈ సిరీస్లో పంత్కు చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. అంతేకాదు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది.
ఎడమచేతి వాటం బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ఆగస్టు 2018లో ఇంగ్లండ్పై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. విదేశీ గడ్డపై అతడు చాలా ప్రమాదకర ఆటగాడిగా పేరు పొందాడు. జట్టును చాలాసార్లు ఇబ్బందుల నుండి రక్షించాడు. ఈ క్రమంలోనే హెడింగ్లీ టెస్టులో పంత్ సెంచరీ చేస్తే.. టెస్టులో అతనికిది 7వ సెంచరీ అవుతుంది. దీంతో టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత వికెట్కీపర్గా రికార్డులకెక్కనున్నాడు. ఈ విషయంలో మహేంద్ర సింగ్ ధోని రికార్డును బద్దలు కొట్టనున్నాడు. ధోనీ తన కెరీర్లో ఆడిన 90 టెస్టుల్లో 6 సెంచరీలు కొట్టాడు.
టెస్టు ఆడే దేశాలపై (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, మరియు ఆస్ట్రేలియా), పంత్ 26 టెస్టు మ్యాచ్ల్లో 48 ఇన్నింగ్స్లలో 37.35 సగటుతో 1,681 పరుగులు చేశాడు. అందులో నాలుగు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక పరుగులు చేసిన ఆసియా వికెట్ కీపర్-బ్యాట్స్మెన్గా అవతరించడానికి పంత్కు కేవలం కొన్ని పరుగులు మాత్రమే అవసరం. ఆ పరుగులు చేస్తే 32 మ్యాచ్లు ఆడి 60 ఇన్నింగ్స్లలో 31.47 సగటుతో ధోని చేసిన 1,731 పరుగుల రికార్డును దాటేస్తాడు.
ఇంగ్లండ్లో వికెట్కీపర్గా పంత్ ఇప్పటివరకు 511 పరుగులు చేశాడు. మరోవైపు విజిటింగ్ వికెట్ కీపర్గా ధోనీ 778 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో పంత్ 267 పరుగులు చేస్తే.. అతడు ధోని రికార్డును బద్దలు కొట్టి అత్యధిక పరుగులు చేసిన విజిటింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అవుతాడు.